భద్రాద్రి కొత్తగూడెం : అందరి భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య పద్ధతిలో టీఆర్ఎస్ మండల కమిటీలు వేసుకుంటాం. గ్రామ కమిటీలలో అవకాశం రాని వారు నిరుత్సాహ పడొద్దు. వారికి మండల, జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయిలో, నామినేటెడ్ పోస్టులలో అవకాశం కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంలో భాగంగా భద్రాచలంలో మండల, పట్టణ కమిటీల ఏర్పాటు కోసం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకుంటున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పట్ల, సీఎం కేసీఆర్ పట్ల రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే చేయలేని పనులు మీ ఇంఛార్జి ద్వారా జరుగుతున్నాయి.
ఆయనకు మేమంతా తోడున్నామని తెలిపారు. ఇక్కడ మెడికల్ కాలేజీ రావడం ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు భద్రాచలంలోనే లభించనుందన్నారు. మాట్లాడితే ప్రగతి భవన్ బద్దలు కొడుతాం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. వందేళ్ల చరిత్ర పార్టీకి అధ్యక్షులుగా ఉన్న వారికి అధికారం రావాలి అంటే ప్రగతి భవన్ బద్దలు కొడితే కాదు.. ప్రజల మనసు గెలుచుకోవడం ముఖ్యం అని కూడా తెలువకపోవడం శోచనీయమన్నారు.
తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని చెప్పి తెలంగాణ వచ్చాక దొంగ దారిలో బీజేపీ ఇక్కడి పవర్ ప్రాజెక్ట్ ను ఆంధ్రలో కలిపింది. పక్కన ఉన్న రాష్ట్రంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి అద్భుత కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇవ్వలేదని విమర్శించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కడుతాం అని కట్టడం లేదు.
బీజేపీ పాపం పెరిగినట్లు ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. త్వరలోనే ఆ పార్టీకి ప్రజలు సరైన బుద్ధి చెప్తారని మంత్రి హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి, ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఉమ్మడి జెడ్పీటీసీలు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తాతా మధు, డాక్టర్ తెల్లాం వెంకట్రావు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ సర్కారు రైతు వ్యతిరేకి: మంత్రి హరీశ్ రావు
ఎంగేజ్మెంట్ రింగ్తో స్టార్ క్రికెటర్
కామారెడ్డి జిల్లాలో చిరుతపులి కలకలం