సిద్దిపేట: కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లను కొనడంలేదని, వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేసి, డీజిల్ ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో రైతులపై భారం పడిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు ఉసురు పోసుకుంటున్నదని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలోని అంకంపేటలో కొత్తగా నిర్మించిన 43 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. కొత్తగా 21 ఇండ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. చింతమడక-అంకంపేట గ్రామం ఐక్యతకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అంకంపేట, సీతారాంపల్లిలోని శంకర్నగర్, ఎస్సీ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
మెదక్ జిల్లాలో పాదయాత్రలు చేస్తున్న నేతలు.. రైతులు, ప్రజలపై ప్రేమ ఉంటే పెంచిన సిలిండర్ల ధర తగ్గించేందుకు కృషిచేయాలని, దానికోసం పాదయాత్రలు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడనైనా ఉన్నాయో చూపెట్టాలన్నారు. దేశంలో రైతులకు రూ.5 లక్షల బీమా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని, దొడ్డు వడ్లు కొనకుండా మొండికేస్తున్నదని విమర్శించారు.
రైతుబంధుతో సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటుంటే.. డీజిల్ పేరుతో బీజేపీ దోచుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతల పాదయాత్ర దేని కోసమని.. డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకా, మార్కెట్లు ఎత్తి వేస్తున్నందుకా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం నీళ్లతో, పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందని, ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం కాదా అని చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.