నిర్మల్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు అవుతుంటే ప్రతిపక్షాలు పనిగట్టుకొని తమ రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేస్తున్నాయని అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. నేరడిగొండ జాతీయ రహదారి నుంచి కుంటాల జలపాతానికి వెళ్లే రహదారిలో రూ. 3.30 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ వంతెన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ( CM KCR) ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణ లాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనమిదేండ్లలో తెలంగాణ(Telangana) ముఖచిత్రమే మారిపోయిందని వెల్లడించారు.
రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువుల పంపిణీ, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా లాంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆసరా, కల్యాణలక్ష్మి (kalyana laxmi), షాదీ ముబారక్, డబుల్ బెడ్ రూం ఇళ్లు,అందజేస్తున్నామని వెల్లడించారు. మిషన్ కాకతీయ( Mission Kakatiya), మిషన్ భగీరథ, పేదలకు కార్పోరేట్ స్థాయిలో ఉత్తమ వైద్య సేవలు, విద్యారంగంలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీటీసీ అనిల్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.