ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఆ పార్టీ బీజేపీకి బీ-టీంగా మారింది. సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేట్ రంగానికి కాంగ్రెస్ ఊతం ఇస్తే.. బీజేపీ మరింత విస్తరింపజేసింది. ప్రభుత్వరంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్కు అమ్ముతున్నది. సంపద సృష్టించాల్సిన ప్రభుత్వాలు ఇలా అమ్ముతూ వెళ్లడం దేనికి సంకేతం? బీజేపీ ఆర్థిక విధానాలను కాంగ్రెస్ పెద్దగా వ్యతిరేకించడం లేదన్న విషయాన్ని మరిచిపోవద్దు.
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు పినరాయి విజయన్ చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు ఘెరంగా ఉన్నాయని, దేశానికి, దేశ ప్రజలకు బీజేపీ చేసిన మేలు ఏమీలేదని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి రావ డం మంచి ప్రయత్నమని చెప్పారు. దేశంలో బలమైన ప్రత్యామ్నాయం రావాలని ఆకాంక్షించారు. బీజేపీకి కాంగ్రెస్ బీ టీం అని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన హైదరాబాద్లో ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలపై కూలంకషంగా మాట్లాడారు.
మీరు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. గవర్నర్లు రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న తీరును ఎలా చూస్తారు? మహారాష్ట్ర,కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో గవర్నర్ల వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనిని ఎలా చూస్తారు?
రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ల జోక్యం మితిమీరుతున్నది. కాంగ్రెస్ హయాం నుంచీ కేంద్ర ప్రభుత్వాలు గవర్నర్లను, గవర్నర్ వ్యవస్థను వాడుకుంటున్నాయి. కాంగ్రెస్ హయాంలో కొంత లిమిట్ ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చాక లిమిట్ లేదు. ఇష్టారీతిగా వాడేస్తున్నారు. ఇదే పెద్ద తేడా. 1957లో కేరళలో అధికారపార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. గవర్నర్ రిపోర్టు పేరుతో రాష్ట్రపతిపాలన విధించింది. ఇప్పుడు బీజేపీ తన పద్ధతులు మార్చింది. గవర్నర్ వ్యవస్థను ఫక్తు రాజకీయ అవసరాల కోసమే వాడుతున్నది.
ఈడీ, సీబీఐ, ఐటీ వంటి నిఘా, దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదన్న ఆరోపణలపై మీరేమంటారు? ప్రత్యేకంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై వీటిని ప్రయోగిస్తున్నది కదా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదన్నది నిజం. దేశవ్యాప్తంగా ఇది జరుగుతున్నది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు విరివిగా తనిఖీలు, దాడులు చేస్తుంటాయి. ఇది మనందరికీ కనిపిస్తున్న నిజం. కేరళలో కూడా వాళ్లు కేంద్ర సంస్థలను ప్రయోగించాలని చూశారు. కానీ, వాళ్ల ప్రయత్నం సఫలం కాలేదు.
తెలంగాణాలో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని చూసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి తన ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నది. ఈ పరిణామాలను మీరేవిధంగా చూస్తారు?
ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు డబ్బులు ఎరజూపి ఆకర్షించడం బీజేపీ నైజం. ఈడీ, సీబీఐ, ఐటీలనే కాదు.. డబ్బును కూడా వాడుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు అనేక రాష్ర్టాల్లో బీజేపీ ఇలాగే అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఈ తరహా విధానాలు సరికావు. రాజకీయ నేతల్లో వీలైనంత త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆతృత పెరుగుతున్నది. ఇది అనర్థాలకు దారితీస్తున్నది.
దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలం కావడాన్ని ఎలా చూస్తారు?
కాంగ్రెస్ దేశంలోని అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ అది బీజేపీకి బీ-టీంగా మారింది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఘెరంగా విఫలమైంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య పెద్ద తేడా లేదు. సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రైవేట్ రంగానికి కాంగ్రెస్ ఊతం ఇస్తే.. బీజేపీ మరింత విస్తరించింది. ప్రభుత్వరంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్కు అమ్ముతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.65 వేల కోట్లు ఆస్తుల అమ్మకం ద్వారా సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. బీజేపీ నిజంగా కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమనుకుంటే.. ఆ తప్పులనే ఎందుకు చేయాలి? దేశ సంపదను పెంచే చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? ప్రజల ఆస్తులను అమ్మడం ఎందుకు? సంపద సృష్టించాల్సిన ప్రభుత్వాలు ఇలా అమ్ముతూ వెళ్లడం దేనికి సంకేతం? వీటిపై చర్చ జరగాలని కమ్యూనిస్టు పార్టీ కోరుతున్నది. బీజేపీ ఆర్థిక విధానాలను కాంగ్రెస్ పెద్దగా వ్యతిరేకించడంలేదు. కాంగ్రెస్ తన హయాంలో తీసుకున్న ఆర్థిక విధానాల విషయంలో తప్పు జరిగినట్టు భావిస్తే ఇప్పటికైనా తమ విధానాలు తప్పు అని చెప్పాలి. బీజేపీ అనుసరిస్తున్న విదేశీ విధానం కూడా లోపభూయిష్టంగానే ఉన్నది. అమెరికా అనుకూల విధానాలను అవలంభిస్తున్నది. ప్రపంచంలోనే మూడో ఆర్థికశక్తిగా ఉద్భవించాల్సిన భారత్.. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండటం సరికాదు. దేశంలో మతవాద సిద్ధాంతాన్ని బీజేపీ ప్రచారం చేస్తున్నది. కాంగ్రెస్ దీనిపై గట్టిగా నిలబడలేకపోతున్నది.
రాష్ర్టాల పట్ల కేంద్రం వివక్షపై మీరేమంటారు? కేంద్రం ప్రకృతి విపత్తుల సందర్భంగా అందించే సహాయంలో కూడా వివక్ష కనిపిస్తున్నది కదా. కేరళ వరదలకు నిధులు ఇవ్వని కేంద్రం.. గుజరాత్కు మాత్రం సహాయం చేయడాన్ని ఎలా చూస్తారు?
కేంద్రం రాష్ర్టాలను సమభావంతో చూడటంలేదు. బీజేపీ రాష్ర్టాలకు ఇస్తున్న స్థాయిలో నిధులను బీజేపీయేతర రాష్ర్టాలకు ఇవ్వడం లేదు. మేము గుజరాత్కు నిధులు ఇవ్వడాన్ని తప్పుబట్టబోం. కేరళకు ఇవ్వకపోవడం సరికాదు. మేము సహాయం కోసం అడిగినపుడు మాకు కూడా సహాయం చేయాల్సింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి. రాష్ర్టాలన్నీ కలిస్తేనే దేశం కదా. రాష్ర్టాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.
జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల పాత్ర ఎలా ఉండబోతున్నదని అంచనా వేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్పై మీ అభిప్రాయం ఏమిటి?
రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర ప్రభావశీలంగా ఉంటుంది. చాలా రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. వారికి మంచి ఫలితాలే వస్తాయను కుంటున్నా.
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అందిస్తున్నది. వీటి గురించి మీరు విన్నారా?
రైతుల కోసం చేపట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కేంద్రం మాత్రం రైతులకు అందించే సహాయాన్ని తగ్గిస్తున్నది. కేంద్ర బడ్జెట్లో ఏటేటా వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి చేస్తున్న కేటాయింపులు తగ్గుతున్నాయి.
కేసీఆర్ బీఆర్ఎస్ని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలపై దృష్టిసారించడాన్ని ఎలా చూస్తారు?
ఇది మంచి ప్రయత్నం. బీజేపీని నిలువరించే క్రమంలో బీఆర్ఎస్ ఏర్పాటు ఆహ్వానించదగ్గదే. గుడ్ మూవ్. ఇతర పార్టీలతో కూడా కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి.