నిజామాబాద్ : అనునిత్యం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులే పరిపాలన సాగిస్తారని, ఆరోపణలు చేసే వ్యక్తులు కాదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పీఏసీఎస్ భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పోచారం మాట్లాడారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
తెలంగాణకు సహాయం చేయడంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రైతులు ఇతరుల వద్ద అప్పు చేయవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధును అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం కాదు. బ్యాంకు లో తమ లాభాలను డిపాజిట్ చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. ఏ ప్రభుత్వాలైనా రైతులను నిర్లక్ష్యం చేస్తే పుట్టగతులు ఉండవుని వెల్లడించారు.2014లో రాష్ట్రంలో 56 లక్షల మంది రైతుల వద్ద 1.08 కోట్ల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి ఉండగా నేడు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా రైతుల సంఖ్య 70లక్షలకు పెరిగిందన్నారు. సాగుభూమి కోటి 53లక్షలకు పెరిగిందని వివరించారు.
ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తుందని తెలిపారు. అనంతరం రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్ర భవనానికి స్పీకర్ పోచారం శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.