హైదరాబాద్: పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే అది బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువసార్లు తెలంగాణ గురించి లోక్సభ, రాజ్యసభల్లో ప్రశ్నించామని గుర్తు చేశారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. సమావేశం అనంతరం నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని అమలుకు సాధ్యంకాని హామీలిచ్చిందని తెలిపారు. కానీ.. ఇప్పుడు వాటిని ఎలా అమలు చేయాలో తెలియక తలలు పట్టుకుంటుదని చెప్పారు.
పింఛన్ తీసుకోవద్దని డిసెంబర్ తర్వాత రూ.4000 వేలు ఇస్తామని, రైతుబంధు రూ.15వేలు వేస్తామని, ప్రతిఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడు గుర్తుచేస్తే ఉలిక్కి పడుతున్నారని నామా మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు దరఖాస్తుల పేరుతో కాలయాపన చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. వందరోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారని, పార్లమెంట్ షెడ్యూల్లోపే వాటిని అమలు చేయాలని ప్రజలు నిలదీయాలని, జాప్యంపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణ సమస్యలకు జాతీయ స్థాయిలో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఖమ్మం లోక్సభ నుంచి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరిని లోక్సభ బరిలో నిలిపినా కలిసి పనిచేస్తామని తెలిపారు.