Harish Rao | సిద్దిపేట/సంగారెడ్డి, మే 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు మాట్లాడుతూ రాహుల్గాంధీ.. రాంగ్ గాంధీగా మారారని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఒక్క హామీ నెరవేర్చకున్నా అన్ని హామీలు నెరవేర్చామని రాహుల్గాంధీ అబద్ధాలు చెప్పటం ప్రజలను మోసగించటమేనని మండిపడ్డారు. అబద్ధాలు ఆడుతున్న రాహుల్గాంధీ తెలంగాణ ప్రజలు, అక్కాచెల్లెల్లకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం జహీరాబాద్, సంగారెడ్డి, తెల్లాపూర్లో రోడ్షోల్లో, సిద్దిపేటలోని ముస్లిం మైనార్టీల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి తీరును దుయ్యబట్టారు. అధికారం కోసం రాహుల్గాంధీ.. రేవంత్రెడ్డి కంటే ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఐదు గ్యారెంటీలు అమలు చేశామని కాంగ్రెస్ చెప్తుంటే.. రాహుల్ మాత్రం అన్ని హామీలు అమలు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని తెలిపారు. మహిళల ఖాతాల్లో రూ.2,500 జమ చేస్తామని, తనది జిమ్మేదారని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన రాహుల్.. ఆ హామీని నెరవేర్చామని అబద్ధం చెప్తున్నారని మండిపడ్డారు. మహిళల ఖాతాల్లో రూ.2,500 జమ చేయలేదు కానీ కేంద్రంలో అధికారం ఇస్తే రూ.8,500 జమచేస్తాననటం హాస్యాస్పదంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. రాహుల్గాంధీ ఎన్నిమాటలు చెప్పినా తెలంగాణ జనం నమ్మరని.. అందుకే జనంలేక ఆయన సభలు వెలవెలబోతున్నాయని ఎద్దేవా చేశారు. సరూర్నగర్ మీటింగ్కు 20 వేల కుర్చీలు వస్తే 5 వేల కుర్చీలు కూడా నిండలేదని వెల్లడించారు.
ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వబోమని ఉదయ్పూర్ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్.. ఈ లోక్సభ ఎన్నికల్లో మెదక్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లలో ప్యారాచూట్ నేతలకే ఎంపీ టికెట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. రాహుల్గాంధీ ఉదయ్పూర్ డిక్లరేషన్ ఏమైంది? కాకి ఎత్తుకెళ్లిందా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు పార్టీమారితే డిస్క్వాలిఫై చేస్తామని చెప్తే.. అందుకు విరుద్ధంగా సీఎం రేవంత్రెడ్డి దానం నాగేందర్ను సభల్లో తనపక్కనే కూర్చోబెట్టుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి స్థానికేతరుడు అంటున్న రేవంత్.. తన సొంత నియోజకవర్గంలో కాకుండా కొడంగల్, మల్కాజిగిరిలో ఎందుకు పోటీ చేశారని నిలదీశారు. దుబ్బాకలో చెల్లని రఘునందన్రావు మెదక్ పార్లమెంట్లో చెల్లుతారా? అని ప్రశ్నించారు. బీజేపీతో పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీకే లాభం చేకూరుతుందని తెలిపారు. తాము బీజేపీతో కలిసి ఉంటే కవిత అరెస్టు అయ్యేవారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో కర్ఫ్యూలు, అల్లర్లు లేవని, ప్రజలంతా కలిసిమెలిసి జీవించారని గుర్తుచేశారు. కేసీఆర్ సెక్యులర్ లీడర్ అని, అన్నివర్గాల అభివృద్ధి కోసం పనిచేశారని వెల్లడించారు. రేవంత్రెడ్డి 12 మంది మంత్రుల్లో ఒక ముస్లిం మైనార్టీకీ స్థానం కల్పించలేదని తెలిపారు. జహీరాబాద్, మెదక్ స్థానాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గాలి అనిల్కుమార్, వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమాల్లో పార్టీ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్కుమార్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మహిపాల్రెడ్డి, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, పార్టీ రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్రావు, శివకుమార్, బుచ్చిరెడ్డి, మైనార్టీ సెల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.