BRS | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 19 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 12 ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో రాష్ట్రంలోని 19 ఎస్సీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీనే అత్యధిక సీట్లను కైవసం చేసుకొన్నది. రాష్ట్రంలో చొప్పదండి, ధర్మపురి, మానకొండూరు, తుంగతుర్తి, జుక్కల్, అచ్చంపేట, వికారాబాద్, అందోల్, చేవెళ్ల, జహీరాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, అలంపూర్, నకిరేకల్, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, మధిర, సత్తుపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి కలిపి మొత్తం 19 ఎస్సీ నియోజక వర్గాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మధిర, సత్తుపల్లి 2 స్థానాలు మినహా మిగిలిన 17 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయకేతనం ఎగరవేశారు. ఆ రెండుస్థానాల్లో ప్రస్తుతం సత్తుపల్లి స్థానం అభ్యర్థి బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. దీంతో మధిర మినహా మిగిలిన అన్ని ఎస్సీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే ఉండగా, మొత్తంగా 18 చోట్ల బీఆర్ఎస్సే ఉన్నది. ప్రస్తుత ఎన్నికల్లో 19 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో బీఆర్ఎస్ కేవలం అలంపూర్లో విజేయుడు, స్టేషన్ఘన్పూర్లో కడియం శ్రీహరి మినహా మిగతా 17 స్థానాల్లో పోటీచేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 12 ఎస్టీ రిజర్వ్ స్థానాలున్నాయి. ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, దేవరకొండ, డోర్నకల్, మహబూబాబాద్, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, ములుగు స్థానాలున్నాయి. అందులో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 5 స్థానాల్లో గెలిచింది. మిగిలిన పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు కూడా బీఆర్ఎస్లో చేరారు. మొత్తంగా 8 మంది ఉన్నారు. మిగిలిన 3 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 12 ఎస్టీ స్థానాల్లో కేవలం ఆసిఫాబాద్, భద్రాచలం, బోథ్ మినహా మరెక్కడా బీఆర్ఎస్ అభ్యర్థులు విజయాన్ని సాధించలేదు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాలను ఈ సారి అత్యధికంగా చేజార్చుకొన్నది.