హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కొంతకాలంగా నిలకడగా ఉన్న ఉల్లి ధరలు మళ్లీ పెరగడం సామాన్యులను కలవరపాటుకు గురిచేస్తున్నది. మార్చిలో రూ.15 ఉన్న కిలో ఉల్లిధర ప్రస్తుతం 45-50కి పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్లో నిన్నమొన్నటి వరకు కిలో ఉల్లి 30-35 మధ్య ఉం డగా ప్రస్తుతం 45 దాటేసింది. కొన్నిచోట్ల 50కి విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో ఈ ధర 40గా ఉంది. సాధారణంగా ఏపీ, హైదరాబాద్కు కర్ణాటక నుంచి ఉల్లి దిగుమతి అవుతుంది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో ఉల్లిసాగు దాదాపు 120 రోజులు ఆలస్యమైంది. ఇది సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ వ్యాపారులు మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి కొత్త ఉల్లి మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు ధరలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తి తగినంత లేకపోవడంతో ఇతర రాష్ర్టాలపై ఆధారపడాల్సి వస్తున్నది. ఇక్కడి వ్యాపారులు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఎంపీ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర వా రం రోజుల్లోనే 25 నుంచి 45కు పెరిగింది. మార్కెటింగ్శాఖ గణాంకాల ప్రకారం.. రా ష్ట్రంలో ఏడాదికి 5.08 లక్షల టన్నుల ఉల్లిని వినియోగిస్తున్నారు. అంటే నెలకు సగటున 42,400 టన్నుల ఉల్లిగడ్డను వినియోగిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో 2.5 లక్షల టన్నులలోపే పండుతుండటంతో ఇతర రాష్ర్టాల నుంచి మార్కెటింగ్శాఖ ఉల్లిని సేకరిస్తున్నది. ఈ ఏడాది సాధారణ విస్తీర్ణంలో 9,405 ఎకరాలకు గాను కేవలం 92 ఎకరాల్లోనే ఉల్లి సాగు చేశారు.
రాష్ట్రంలోని ఉల్లి ఉత్పత్తిలో 80 శాతం మహబూబ్నగర్ జిల్లాలోనే సాగవుతుండగా ఈసారి అక్కడ ఉల్లిసాగు గణనీయంగా పడిపోయింది. రాష్ట్రంలోనే అతిపెద్ద ఉల్లి మారెట్ అయిన మలక్పేటకు ఇతర రాష్ట్రాల నుంచి రోజుకు 10,000 క్వింటాళ్ల ఉల్లి వస్తుండగా ప్రస్తుతం ఇది 5,000 క్వింటాళ్ల కంటే తకువకు పడిపోయింది. మున్ముందు దిగుమతులు మరింత పడిపోయే అవకాశం ఉందని, అదే జరిగితే మార్చి నాటికి ఉల్లి కొరత తీవ్రమై కిలో రూ. 70-80కి చేరుకునే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు పేర్కొన్నాయి.