Telangana | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తున్నది. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదగిరిగుట్ట ఆలయం పనులు పూర్తయి భక్తజన సందోహంతో అలరారుతున్నది. ఇతర ప్రధాన ఆలయాల్లో ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. జిల్లాల వారీగా ఎంపికచేసిన ప్రముఖ ఆలయాల్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) కింద ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. ఇందులో 16 ఆలయాలకు సుమారు రూ.170 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో 146 పనులు మంజూరయ్యాయి.
అందులో రూ.51.47 కోట్లతో 90 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో రూ.15 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కాళేశ్వరం, చింతమడక ఆలయాలకు స్థల సేకరణలో ఇబ్బందులు ఎదురవగా, బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పనులకు మాస్టర్ప్లాన్ రూపకల్పన జరుగుతున్నది. ధర్మపురి ఆలయ పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇవి మినహా మిగతా ఆలయాల్లో పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి రూ.100 కోట్లు సహా మొత్తం ఐదు ప్రధాన ఆలయాలకు రూ.136 కోట్లను మంజూరు చేసింది. పనుల కోసం అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
నాడు నిరాదరణలో ప్రధాన ఆలయాలు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక మునుపు తెలంగాణలో ప్రధాన ఆలయాలు సైతం నిరాదరణకు గురయ్యాయి. అనేక పురాతన, చారిత్రక ఆలయాలను ఉమ్మడి పాలకులు పట్టించుకున్న పాపానపోలేదు. ఏ ఒక్క ఆలయానికీ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయలేదు. యాదగిరిగుట్ట, భద్రాచలం వంటి ప్రధాన ఆలయాలను పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం దశలవారీగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది. ప్రత్యేక నిధులు కేటాయిస్తూ భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇవిగాకుండా ధూపదీప నైవేద్య పథకం కింద ప్రతినెలా రూ.6000 చొప్పున 4,000 ఆలయాలకు ప్రభుత్వం నిధులు విడుదల
చేస్తున్నది.
ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన పనుల వివరాలు