ధర్మారం, ఏప్రిల్ 9: కాళేశ్వర జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. గత జనవరి 6న మొదలైన జలాల తరలింపు విడతల వారీగా కొనసాగుతున్నది. మేడిగడ్డలోని లక్ష్మీ బరాజ్, అన్నారంలోని సరస్వతీ, గోలివాడలోని పార్వతీ బరాజ్ల మీదుగా ఎల్లంపల్లికి చేరుతున్న జలాలను నంది పంప్హౌస్ ద్వారా ఎగువకు తరలిస్తున్నారు. ప్రస్తుతం నంది పంప్హౌస్లోని ఆరో మోటర్ను ఆన్ చేసి 3,150 క్యూసెక్కుల నీటిని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్కు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి అదే పరిమాణంలో ఎస్సారార్ రిజర్వాయర్కు చేరవేస్తున్నారు. ఎస్సారార్ నుంచి మల్లన్న సాగర్కు పంపిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఎస్సారార్ రిజర్వాయర్లోకి 28.5 టీఎంసీలు ఎత్తిపోసినట్టు నీటిపారుదల శాఖ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.