CM KCR | రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందజేయాలన్న సదాశయంతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే.. పథకం ప్రారంభానికి ఒకరోజు ముందే వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 170 పాఠశాలలకు చెందిన లక్ష మంది విద్యార్థులు పోస్టుకార్డుల ద్వారా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు రాసిన ఉత్తరాల్లో ఏముందంటే.. ‘సీఎం కేసీఆర్ తాతకు నమస్కారాలు.
మా బడులు మారుతున్నాయి. ఇప్పుడు మా ఆకలి తీర్చడానికి అమ్మలా ఆలోచించి మీరు ప్రేమతో సీఎం అల్పాహార పథకం పెట్టినందుకు శతకోటి వందనాలు. ఖాళీ కడుపుతో రోజూ బడికి వెళ్తే క్లాసులో కండ్లు తిరుగుతుండేవి. పొద్దునే ఇంటి పనితోపాటు మాకు వంట చేసేందుకు అమ్మకు కష్టంగా ఉండేది. అమ్మను బాధపెట్టలేక ఖాళీ కడుపుతోనే బడికి వచ్చేవాళ్లము. ప్రార్థనలో చాలా సార్లు పడిపోయాము. ఇలాంటి పరిస్థితులలో అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నందుకు చేతులెత్తి మొక్కుతున్నాము. మన ఊరు-మన బడి పథకంతో మా బడులు మెరిసిపోతున్నాయి. పేద పిల్లల చదువు కోసం ఆరాటపడుతున్న మీకు మా అమ్మానాన్న తరఫున ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నారు.
– తొర్రూరు