జగిత్యాల, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరిట తెలంగాణ ప్రజలను దగా చేసేందుకు రెడీ అవుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆ పార్టీ వైఖరేంటని ప్రశ్నించారు. డిక్లరేషన్ల ముసుగులో అబద్ధపు హామీలిస్తున్న హస్తం పార్టీ నాయకులు.. వారి పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే తెలంగాణలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలోని చల్గల్ మామిడి మార్కెట్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. దేశంలోని కీలక అంశాలపై ఏ వైఖరీ లేని ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు. సీడబ్ల్యూసీ మీటింగ్ కోసం హైదరాబాద్కు వస్తున్న సోనియా, రాహుల్కు తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని కలలోనైనా ఊహించగలరా? అని ప్రశ్నించారు. రాహుల్గాంధీ అప్డేట్ కానీ.. ఔట్ డేటెడ్ లీడర్ అని విమర్శించారు. ఆయన సీఎం కేసీఆర్ వేగాన్ని అందుకోలేరని చెప్పారు.
‘ఇటీవల రాహుల్, మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చి పోడు పట్టాలు ఇస్తామన్నారు.. వీళ్లు మారరా.? అప్డేట్ కారా? మనం మొన్ననే పోడు పట్టాలు ఇచ్చేశాం. మళ్లీ వాళ్లు ఇచ్చేదేంది’ అని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు కింద రూ.10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్ వాళ్లు రూ.12 లక్షలు ఇస్తమంటున్నరు.. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని చురకలంటించారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ను దేశం మొత్తం తిరస్కరించిందని, అలాంటి పార్టీని మనం నమ్ముదామా? అని ప్రశ్నించారు. దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్వన్గా ఉన్నదని చెప్పారు. ఉద్యోగాల కల్పన, తలసరి ఆదాయం, మత సామరస్యం, పంటలు, మహిళా అభ్యున్నతిలో, పెట్టుబడుల ఆకర్షణ, రైతులు, దళితులు, మైనార్టీ, ఎస్టీ, బీసీ సంక్షేమంలో రాష్ట్రం అగ్రగామిగా ఉన్నదని వెల్లడించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నారు కాబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. ‘కేసీఆర్ అంటే.. కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లే కాదు. కేసీఆర్ అంటే కైండ్ హార్టెడ్ కమిటెడ్ రెస్పాన్సిబుల్ లీడర్’ అని అభివర్ణించారు. కేసీఆర్ లాంటి అరుదైన నేత తెలంగాణలో పుట్టడం మన అదృష్టమని చెప్పారు.
ఎమ్మెల్యే సంజయ్కుమార్ను గతంలో కంటే భారీ మెజార్టీతో గెలిపించాలని కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లోకి ఎల్ రమణ రావడంతో వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని చెప్పారు. జగిత్యాలలో అన్ని కుల సంఘాలకు ప్రభుత్వం తరఫున స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు కూడా రెండెకరాల స్థలంలో భవనం నిర్మించడానికి చొరవ చూపాలని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్కుమార్ను కవిత కోరారు. బీఆర్ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే మరోసారి మొదలుకావాలని సూచించారు. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఉద్యమించి తెచ్చుకున్న రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే నంబర్వన్గా అవతరించిందని చెప్పారు. తొమ్మిదేండ్ల కాలంలో బొమ్మరిల్లులా మారిందని తెలిపారు. కష్టపడి అభివృద్ధి చేసుకున్న రాష్ట్రంలోకి దొంగలు ప్రవేశించి నాశనం చేయాలనుకుంటే సాగనివ్వబోమని స్పష్టంచేశారు. కార్యకర్తలు ఎన్నికలను యుద్ద క్షేత్రంలాగే భావించి పనిచేయాలని, ప్రతిపక్ష కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్లు గోలి శ్రీనివాస్, మోర హన్మాండ్లు పాల్గొన్నారు.