హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీ శాట్ మరో ముందడుగు వేసింది. తన సేవలను విశ్వవిద్యాలయాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటికే పాఠశాల, కళాశాల, సాంకేతిక, వృత్తి నైపుణ్య విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలను టీ శాట్ ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా యూనివర్సిటీ పాఠ్యాంశాల ప్రసారానికి సిద్ధమైంది. ఈ మేరకు టీశాట్ రాష్ట్రంలోని కాకతీయ వర్సిటీ (మీడియా ప్రొడక్షన్ సెంటర్, ఎస్డీఎల్సీఈ)తో ఒప్పందం కుదుర్చుకొన్నది.
ఇందులోభాగంగా కాకతీయ వర్సిటీ పాఠ్యాంశ వీడియోలను టీ శాట్ నెట్వర్క్ చానెళ్లు విద్య, నిపుణలో ప్రసారం చేయనున్నారు. దీనిద్వారా కేయూ పరిధిలోని 473 అనుబంధ కళాశాలకు చెందిన సుమారు 1,00,835 యూజీ, 16,190 పీజీ కోర్సుల విద్యార్థులకు ప్రయోజనం కలుగనున్నది. త్వరలోనే ఓయూతో ఒప్పందం కుదుర్చుకొంటామని సీశాట్ సీఈవో శైలేశ్రెడ్డి తెలిపారు. ఓయూ పరిధిలోని 720 అనుంబంధ కళాశాలలకు చెందిన సుమారు 4 లక్షల మంది విద్యార్థులకు పాఠ్యాంశాలు అందిస్తామని పేర్కొన్నారు.