హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, జూలై వరకు కరివెన జలాశయానికి నీళ్లను తరలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆగస్టు నాటికి ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాగునీటి కాంపోనెంట్ పనులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు పనుల తరహాలోనే కొనసాగాలని ఆదేశించారు. సాగునీటిశాఖ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించడంతోపాటు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. తాగునీటికి సంబంధించిన పనులన్నీ పూర్తిచేయడానికి అవసరమైన అనుమతులను వెంటనే పొందాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ సోమవారం మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతి తదితర అంశాలపై ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ కూలంకషంగా చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన తాగునీటి పనులపై ఎన్జీటీ విధించిన స్టేను సుప్రీంకోర్టు ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే.
ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలి..
రెండు వారాలకు ఒకసారి ఇరిగేషన్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, సత్వరమే పరిష్కరించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. జూలై వరకు కరివెన జలాశయానికి నీళ్లను తరలించాలని, ఆగస్టు నాటికి ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని స్పష్టం చేశారు. నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలకు సంబంధించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ‘కన్వేయర్ సిస్టమ్’లో మిగిలిన పనులనూ కూడా జాప్యం లేకుండా పూర్తిచేయాలని ఆదేశించారు. తాగునీటి కాంపోనెంట్ పనులను పూర్తిచేసేందుకు అనుమతులన్నింటికీ వెంటనే ప్రతిపాదనలు పంపాలని చెప్పారు.
అనంతరం పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు. మిగిలిన పనులను జూన్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు రంజిత్రెడ్డి, పీ రాములు, శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు జనార్దన్రెడ్డి, యాదయ్య, వెంకటేశ్వర్రెడ్డి, నరేందర్రెడ్డి, రాజేందర్రెడ్డి, బాలరాజు, హర్షవర్ధన్రెడ్డి, లక్ష్మిరెడ్డి, అంజయ్యయాదవ్, ప్రకాశ్గౌడ్, మహేశ్రెడ్డి, కిషన్రెడ్డి, జైపాల్యాదవ్, ఆనంద్, రోహిత్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయగౌడ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, అడ్వైజర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెంటారెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, సీఈలు హమీద్ఖాన్, ధర్మా, ఎస్ఈలు పాల్గొన్నారు.