సమాజానికి వెలుగులు పంచటానికి వారంతా చీకట్లలో మగ్గిపోతున్నారు. ఒళ్లు హూనం చేసుకుంటూ రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఒకసారి పనిలోకి వెళితే తిరిగి వస్తామన్న గ్యారెంటీ లేని బతుకులు వారివి. అంత కష్టం చేసేటోళ్లు ఇంటికొచ్చాక సేదతీరుదామన్నా కుదరని దుస్థితి. సింగిల్ బెడ్రూంలో ఇంటిల్లిపాది ఉండాల్సి రావటం, అరకొర వసతులు వారికి నిద్రను కూడా దూరం చేశాయి. క్వార్టర్ దొరకని వారి పరిస్థితి మరీ దారుణం. ఏటేటా పెరిగే అద్దెలు అదనపు భారం. వీరంతా సింగరేణి కార్మికులు. చీకటి సూర్యుళ్లు. సింగరేణి కార్మికుల కష్టాలన్నీ కనులారా చూసిన సీఎం కేసీఆర్ చలించిపోయారు. విశాలమైన, అధునాతన డబుల్బెడ్రూం క్వార్టర్లను నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. అందులో భాగంగానే భూపాలపల్లి ఏరియాలో సుమారు వెయ్యి డబుల్బెడ్రూంల నిర్మాణం పూర్తయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో సింగరేణి క్వార్టర్లు పిట్టగూళ్లను తలపించేవి. బ్యారక్లు, సింగిల్ బెడ్రూం క్వార్టర్లు ఉండేవి. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉండాలంటే చాలా ఇబ్బంది పడేవారు. మరోవైపు కార్మికుల సంఖ్యకు అనుగుణంగా క్వార్టర్ల నిర్మాణం జరుగలేదు. స్వరాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు కోల్బెల్ట్లో పర్యటించిన సందర్భంలో సింగరేణి క్వార్టర్లు, బ్యారక్లలో నివాసం ఉండే కార్మికుల కుటుంబాలను చూసి చలించిపోయారు. స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు సౌకర్యవంతమైన డబుల్ బెడ్రూం క్వార్టర్లను నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సత్తుపల్లి, భూపాలపల్లి ఏరియాల్లో డబుల్ బెడ్రూం క్వార్టర్ల నిర్మాణం చేపట్టారు. ఎప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుందా? విశాలమైన క్వార్టర్లలోకి ఎప్పుడెపుడు పోదామా? అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. సింగరేణి కార్మికుల కళ్లలో ఆనందం వ్యక్తమవుతున్నది.
సీఎం కేసీఆర్ కృషి ఫలితం.. 994 క్వార్టర్ల నిర్మాణం
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియాలో 994 డబుల్ బెడ్రూం క్వార్టర్ల నిర్మాణం చేపట్టింది. ఇందుకు రూ.229 కోట్లు కేటాయిస్తూ సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పరిపాలనా అనుమతికి ఆమోద ముద్ర వేసింది. టెండర్ విలువ రూ.168 కోట్లకు 2020 ఆగస్టు 7న అవార్డయింది. 2020 అక్టోబర్ 31న ఈ నిర్మాణ పనులను ప్రారంభించారు. కరోనా ప్రభావం వల్ల మొదట్లో పనులు కొంత మందకొడిగా సాగినా, తర్వాత శరవేగంగా పనులు చేసి 600 క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేశారు. అదేవిధంగా శానిటరీ, మంచినీటి పైపులైన్ల నిర్మాణం, విద్యుత్తు, అంతర్గత రోడ్లు, పెయింటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. మిగతా 394 క్వార్టర్ల నిర్మాణ పనులు ఈ సంవత్సరం మార్చి నాటికి పూర్తి కానున్నాయి. 994 డబుల్ బెడ్రూం క్వార్టర్ల సముదాయానికి సింగరేణి యాజమాన్యం రామప్ప కాలనీగా నామకరణం చేసింది.
డబుల్ బెడ్రూం క్వార్టర్ల ప్రత్యేకతలివే
సమైక్య పాలనలో కేవలం 450 చ.అడుగుల క్వార్టర్లను నిర్మించారు. ఒక బెడ్రూం, ఒక హాల్, కిచెన్ మాత్రమే ఉండేది. పాత క్వార్టర్లకు మెట్ల సౌకర్యం ఉండేది కాదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం క్వార్టర్లు రెండు బెడ్రూంలు, గ్రానైట్తో మెట్ల నిర్మాణం, కిచెన్ ప్లాట్ఫారం, స్టీల్ రెయిలింగ్, విట్రిఫైడ్ టైల్స్తో ప్లోరింగ్, యూరోపియన్ వాటర్ కోజెట్ (ఈడబ్ల్యుసీ), ఇండియన్ వాటర్ కోజెట్ (ఐడబ్ల్యుసీ), ఇలా అధునాతన సౌకర్యాలతో 708 చ.అడుగుల ప్లింత్ ఏరియా, 963 చ.అడుగుల బిల్డప్ ఏరియా కలిగి ఉన్నాయి.
23న మంత్రి కేటీఆర్ ద్వారా ప్రారంభోత్సవం
స్వరాష్ట్రంలో భూపాలపల్లి ఏరియాలో ప్రప్రథమంగా అధునాతన సౌకర్యాలతో నిర్మించిన 994 డబుల్ బెడ్రూం క్వార్టర్ల సముదాయానికి ఈ నెల 23న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.
మంచి సౌలతులున్న క్వార్టర్లు కట్టిండ్లు
నేను 1993లో సింగరేణిలో ఉద్యోగంలో చేరిన. అప్పటి నుండి ఇప్పటి వరకు భూపాలపల్లి ఏరియాలోనే పని జేత్తున్న. ఇంటి కిరాయిలు కట్టలేక సచ్చిపోతున్న. ఏడాదికి 60 వేలు ఇంటి కిరాయిలే అయితున్నయ్ ఇప్పుడు కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూం క్వార్టర్లు కట్టిచ్చిండు. ఇక్కడ మంచి సౌలతులు ఉన్నాయి. ఇందులో నాకు తప్పకుండా క్వార్టర్ వత్తది. ఇంత మంచిగ చేస్తున్న కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– జర్పుల సక్రు, లైన్మెన్, కేటీకే 5వ గని, భూపాలపల్లి
కొత్త క్వార్టర్లో పెద్ద కుటుంబంతో..
ఇప్పుడు భూపాలపల్లిలో, మొన్న సత్తుపల్లిలో డబుల్ బెడ్రూం క్వార్టర్లు కట్టినట్టు ఇంతకుముందు సింగరేణి చరిత్రలోనే ఎక్కడా కట్టలేదు. డబుల్ బెడ్రూం క్వార్టర్లో పెద్ద కుటుంబంతో ఉండవచ్చు. మంచి వసతులతో కట్టించారు. చాలా ఆనందంగా ఉంది.
– సలకాల వెంకట్రాజం, టబ్బు రిపేర్ మజ్దూర్, కేటీకే 6వ గని, భూపాలపల్లి
పాత క్వార్టర్లలో ఇబ్బందే
ఇప్పుడున్న పాత క్వార్టర్లలో పిల్లలు, పె ద్దోళ్లు ఉండుడు ఇ బ్బందే అవుతాంది. భూపాలపల్లిలో కట్టిన డబుల్ బెడ్రూం ఇం డ్లు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు, నాతోటి కార్మికులెందరికో క్వార్టర్లు దొరుకుతాయి.
–బాలసాని సదాకర్, మున్షిప్, కేటీకే 5వ గని, భూపాలపల్లి
డబుల్ బెడ్రూం వత్తదని చాలా సంతోషంగా ఉంది
సింగరేణిలోనే మంచి వసతులున్న డబుల్ బెడ్రూం క్వార్టర్లు భూపాలపల్లిలో కట్టిండ్లు. అందులో క్వార్టర్ తప్పనిసరిగా నాకు వత్తది. చాలా సంతోషమేత్తాంది. నేను 1995లో కంపెనీ నౌకరిలో చేరా. మొదట్లో గోలేటిలో పని చేసిన. 22 ఏండ్ల కింద భూపాలపల్లికి బదిలీపై వచ్చా. నేను భూపాలపల్లికి వచ్చినప్పటి నుండి కిరాయి ఇంట్లోనే ఉంటున్న. – లింగం రాజేశం, ట్రామర్, కేటీకే 5వ గని, భూపాలపల్లి