Congress | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, వామపక్షాల మధ్య దోబూచులాట కొనసాగుతున్నది. సీపీఎంకు మిర్యాలగూడ నియోజకవర్గంతోపాటు వైరా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం. హైదరాబాద్ పరిధిలోని మలక్పేట నియోజకవర్గంతోపాటు ఎమ్మెల్సీ పదవిని ఆశ జూపినట్టు తెలుస్తున్నది. సీపీఐకి కొత్తగూడెంతోపాటు చెన్నూరు కేటాయించేందుకు కాంగ్రెస్ ప్రతిపాదించగా వామపక్ష అనుబంధ కార్మికసంఘం వ్యతిరేకించింది. దీంతో చెన్నూరు బదులుగా పాతబస్తీ పరిధిలోని కార్వాన్ నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించనున్నట్టు సమాచారం.
ఇందుకు ఆ రెండు పార్టీలు ఒప్పుకుంటే ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే, కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలోనే కార్వాన్ అభ్యర్థిగా ఉస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ, మలక్పేట అభ్యర్థిగా షేక్ అక్బర్ పేరును ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరినీ అధిష్ఠానం బుజ్జగించాల్సి వస్తుంది. కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మిర్యాలగూడ నుంచి సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నది.