హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎప్పటి నుంచో ఆయిల్పామ్ సాగవుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం తర్వాత ఆయిల్పామ్ సాగుచేసిన కొత్త జిల్లాల్లో పంట దిగుబడులు చేతికొస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటికే తొలిపంట చేతికొచ్చింది. కురవి మండలం కొత్తూరు గ్రామంలో రైతు ఇంద్రసేనారెడ్డి సాగు చేసిన 20 ఎకరాల ఆయిల్పామ్ తోటలో ఆశించిన స్థాయిలో గెలలు ఉత్పత్తి అవుతున్నాయి. తొమ్మిది నెలల్లోనే 40 టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పటివరకు ఆ రైతుకు రూ.6.63 లక్షల ఆదాయం సమకూరింది. ఇంకా ఉత్పత్తి పెరిగి మరింత ఆదాయం సమకూరనున్నది.
రెండున్నరేండ్లలోనే తొలి క్రాప్
ఆయిల్పామ్ మొక్కలు నాటిన తర్వాత మూడేండ్ల నుంచి గెలలు ఉత్పత్తి అవుతాయి. ఐదేండ్ల నుంచి మంచి పంట చేతికొస్తుంది. కానీ, రాష్ట్రంలో కొత్త జిల్లాలో కేవలం రెండున్నరేండ్లలోనే తొలి క్రాప్ ప్రారంభం కావడం గమనార్హం. రైతు ఇంద్రసేనారెడ్డి 2019 సెప్టెంబర్లో ఆయిల్పామ్ మొక్కలు నాటగా 2022 జూన్లోనే తొలి క్రాప్ చేతికొచ్చింది.
రైతుల్లో పెరిగిన నమ్మకం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులను లాభదాయకమైన పంటలవైపు మళ్లించాలనే ఉద్దేశంతో దీనిని ప్రోత్సహించింది. తొలుత కొందరే రైతులు ముందుకొచ్చారు. ఇప్పుడు మహబూబాబాద్ వంటి నూతన జిల్లాల్లో ఆయిల్పామ్ సాగు అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. దీంతో ఇతర రైతుల్లో ఆయిల్పామ్ సాగుపై క్రమంగా నమ్మకం పెరుగుతున్నది.
నిరుడు 82 వేల ఎకరాల్లో కొత్త సాగు
వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నది. దీనికోసం రైతులకు సబ్సిడీలతో పాటు మొక్కలను అందిస్తున్నది. ఫలితంగా నిరుడు 82 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్పామ్ సాగులోకొచ్చింది. దేశంలో ఒకే ఏడాదిలో ఇంత భారీ విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగుచేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో మొత్తం ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం 1.41 లక్షల ఎకరాలకు చేరింది.
మార్కెటింగ్ ఇబ్బంది అసలే లేదు
20 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశా. తొలి పంట చేతికొచ్చింది. ఇప్పటివరకు 40 టన్నులు విక్రయించా. సాగు లో, కొనుగోలులో ఆయిల్ఫెడ్ అధికారులు సూచనలు ఇస్తున్నారు. పంట కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లిస్తున్నారు. చాలామంది రైతులు ఇక్కడికొచ్చి పంటను చూసి.. ఆయిల్పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
– ఇంద్రసేనారెడ్డి, రైతు, కొత్తూరు, మహబూబాబాద్ జిల్లా