హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులను మంజూరు చేయడంలో ఓవైపు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుండగా, మంజూరైన రోడ్డు పనులు ముందుకు సాగకుండా జాతీయ రహదారుల శాఖ అధికారులు అడ్డుపుల్లలు వేస్తున్నారు. మరోవైపు ఆర్ అండ్ బీ శాఖలో కుమ్ములాటలే జాప్యానికి కారణమంటూ నిందలు వేస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్లకు అవసరమైన భూసేకరణ నిధులు భరించేందుకు కేంద్రం ఒప్పుకున్నప్పటికీ ఆ శాఖ అధికారులు నిధులు విడుదల చేయకుండా సతాయిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే, గడచిన ఐదేండ్లలో కేంద్రం మంజూరుచేసిన పలు ప్రాజక్టుల్లో హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఉద్దేశించిన ఫ్లైఓవర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఎన్హెచ్-44లోని ఆరాంఘర్-శంషాబాద్ ఆరులేన్ల రహదారి, ఎన్హెచ్-163లోని ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్ ముఖ్యమైనవి. ఈ రెండు జాతీయ ప్రాజక్టులే అయినా భూసేకరణ ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ డబ్బును తిరిగి ఇస్తామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ 2021 సెప్టెంబర్లో తెలిపింది కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు.
ఆరామ్ఘర్-శంషాబాద్ మార్గం నిర్మాణ పనులకు ఈ ఏడాది జనవరిలో సగం నిధులు విడుదల చేయగా, మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణకు ఇంతవరకూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇవి కాకుండా.. ఐదు ప్రాజక్టులు మంజూరై ఏండ్లు గడుస్తున్నా టెండర్లు పిలిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలేదు. ఎన్హెచ్-163పై నిర్మిస్తున్న అంబర్పేట్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ పనులు, ఎన్హెచ్-65లో ఎల్బీనగర్-మల్కాపూర్ ఆరులేన్ల రోడ్డు పనులు భూసేకరణ సమస్యల వల్ల మొదట్లో కొంత ఆలస్యమైనా ప్రస్తుతం ఊపందుకున్నాయి.
ఎన్హెచ్-65లోని పుణె-హైదరాబాద్ మార్గంలో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం సర్వీసు రోడ్డు పనులు, ఇతర శాఖల యుటిలిటీ షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు మరింత సులభంగా జరిగేందుకు డిజైన్ మార్పుకోసం సంబంధిత కేంద్ర జాతీయ రహదారుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. అక్కడినుంచి మార్గదర్శకాలు, ఆదేశాలు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు ఆర్అండ్బీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల శాఖకు చెందిన ప్రాంతీయ అధికారి (ఆర్వో) ఎస్కే కుశ్వాహా తెలంగాణలో పలు రహదారుల నిర్మాణం పనుల్లో జాప్యానికి ఆర్ అండ్ బీ శాఖలో అంతర్గత కుమ్ములాటలే కారణమంటూ ఇటీవల లేఖ రాయడం వివాదాస్పదమైంది. కుశ్వాహా ఆరోపణలను ఖండించిన ఆర్అండ్బీ అధికారులు, ఆయా ప్రాజక్టు పనుల పురోగతి వివరాలను సోమవారం వెల్లడించారు.
జాతీయ రహదారుల శాఖకు చెందిన ప్రాంతీయ అధికారి ఎస్కే కుశ్వాహా తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖపై నిందారోపణలు చేస్తున్నారని ఆర్అండ్బీ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనేక ప్రాజక్టులు ఆర్వో కార్యాలయంలో పెండింగులో ఉండడంపట్ల జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులు ఇటీవల కుశ్వాహాను మందలించడంతో చేసేదిలేక ఆయన ఆర్అండ్బీలో అంతర్గత కుమ్ములాటలంటూ తమపై నిందలు మోపుతున్నారని వారు మండిపడ్డారు. కుశ్వాహా ఆరోపణలు పూర్తిగా సత్యదూరమని, జాప్యానికి కారణం ఆర్వో కార్యాలయం పనితీరేనని వారు స్పష్టంచేశారు.