Indravelli Massacre | హైదరాబాద్/ఆదిలాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): సరిగ్గా 42 ఏండ్ల కిందట.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజనుల ఊచకోత.. కాంగ్రెస్ పాలనలో జరిగిన మారణ హోమం అది.. ఇప్పటికీ చేదు జ్ఞాపకంగా వెంటాడుతూనే ఉన్నది. అధికారికంగా 13 మంది చనిపోయినట్టు ప్రకటించినా, 250 మందికి పైగా ప్రాణాలు విడిచారని అనధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఆదివారం ఖమ్మం సభలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మాట్లాడుతూ.. గిరిజనులను ఉద్దరిస్తామన్న వ్యాఖ్యల నేపథ్యంలో నాటి దారుణ ఘటన గుర్తుకొస్తున్నది. తెలంగాణ సర్కారు లక్షన్నర మందికే పోడు పట్టాలు ఇచ్చిందని, తామైతే అందరికీ ఇస్తామని రాహుల్ ప్రకటించటంపై పలువురు తప్పుబడుతున్నారు. వందల మంది గిరిజనులను పొట్టనబెట్టుకున్న చరిత్ర మీది కాదా? అని మండిపడుతున్నారు.
ఇంద్రవెల్లిలో ఏం జరిగింది?
భూస్వాముల దౌర్జన్యాలు, గిరిజనేతరుల అటవీ భూముల ఆక్రమణలకు వ్యతిరేకంగా, వ్యాపారులు ఉప్పుతో సమానంగా సారపల్కులను తీసుకుంటూ ఆదివాసీల దోపిడీకి వ్యతిరేకంగా, ఫారెస్టు అధికారులు వసూలు చేసే ‘బంచరాయి’ పన్ను (అడవిలో మేకలు మేపుకొన్నందుకు ఒక్కో మేకకు రూ.5 చొప్పున.. ఒకవేళ 20 మేకలుంటే ఒక మేక ఇవ్వాలి)కు వ్యతిరేకంగా గిరిజన, ఆదివాసీలు నిరసనకు దిగారు. 1981 ఏప్రిల్ 20న ఆదివాసీలు సుమారు ఆరేడు వేల మంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయం.. ఇంద్రవెల్లి అంతా గిరిజనులతో కిక్కిరిసిపోయింది. సమావేశం జరగకుండా అప్పటి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. వాహనాలు రాకుండా రహదారులను దిగ్బంధించారు. అయినా పెద్ద సంఖ్యలో వచ్చిన గిరిజనులను చూసిన పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సభాస్థలానికి గిరిజనులు ర్యాలీగా బయలుదేరారు. అప్పటి ప్రభుత్వం తాడోపేడో తేల్చుకోవాలనే కసితో ఉన్నది. వేల మందితో వస్తున్న గిరిజనుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ జవాన్ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రాణం కంటే శీలం ముఖ్యమనుకున్న ఆ యువతి జవాన్పై దాడి చేసింది. అంతే ఆ జవాన్ నేలకొరిగాడు. పరిస్థితి చేయిదాటి పోయిందంటూ పోలీసులు తుపాకులకు పని చెప్పారు. తుపాకుల శబ్దంతో ఇంద్రవెల్లి దద్దరిల్లింది. గిరిజనులపై అప్పటి పోలీసులు తూటాల వర్షం కురిపించారు. దీంతో వందల మంది గిరిజనులు నేలకొరిగారు. చుట్టుపక్కల పచ్చని చెట్లు ఎర్రగా మారాయి. గోండుల రక్తం భూమిపై ఏరులై పారింది. ఎటుచూసినా రక్తపు మడుగులు కనిపించాయి. వందల మంది గిరిజనులు అరుపులు, కేకలతో వాగుల వెంట పరుగులు తీశారు. ఈ చేదు జ్ఞాపకాలు గిరిజనుల గుండెలను వీడటం లేదు. కాల్పుల్లో గాయాలపాలైన వారు కొంతమంది మృతి చెందగా.. మరికొందరు ఇప్పటికీ బతికే ఉన్నారు. ఏప్రిల్ 20 వచ్చిందంటే చాలు గిరిజనులు ఈ ఘటనను గుర్తుచేసుకొని భయంతో వణికిపోతుంటారు.
మృతులు 250 మందికిపైగానే..
కాల్పుల్లో కేవలం 13 మంది చనిపోయారని అధికార గణాంకాలు చె ప్తున్నాయి. కానీ ఆ ఘటనలో చనిపోయినవారు, గాయపడి చికిత్స తీసుకుంటూ.. ఆ తర్వాత అనారోగ్యంతో పదుల సంఖ్యలో ఆదివాసీలు మరణించారని వివిధ సంఘాలు చెప్తున్నాయి. 100 మందికిపైగా చనిపోయినట్టు పౌర హక్కుల సంఘం తేల్చ గా, మరో సంఘం 250 మందికిపైగా చనిపోయినట్టు చెప్పింది. కాల్పులతో ఆదివాసీలను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక ఉద్ధరిస్తామని చెప్పటంపై ఆ గ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.