ఖైరతాబాద్, జూలై 1: ‘ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ప్రధానమైంది. ప్రభుత్వం, అధికారులు పనిచేస్తారు. ప్రజలు కూడా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలి’ అని రాష్ట్ర పశుసంవర్ధక, శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పది రోజుల పాటు పట్టణ ప్రగతి చేపడుతున్నామని, ప్రజలు తమ వంతు సాకారం అందించాలని అన్నారు. గురువారం ఖైరతాబాద్ డివిజన్లోని దుర్గానగర్కాలనీ పార్కులో ప్రారంభించిన ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, కార్పొరేటర్ విజయారెడ్డి, జడ్సీ ప్రావిణ్యతో కలిసి మొక్కలు నాటారు. కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి పట్టణ ప్రగతి బ్రోచర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హరితహారం ప్రత్యేక అధికారి కృష్ణ, డీఎంసీ వంశీకృష్ణ, ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్నారాయణ, సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేశ్, టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్యాదవ్, పి.నాగరాజు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్: నగరంలో పచ్చదనాన్ని మరింత పెంపొందించడతో పాటు పరిశుభ్రతను కాపాడేందుకు పట్టణ ప్రగతి దోహదపడుతుందని మేయర్ విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో గురువారం పట్టణ ప్రగతిని మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, జడ్సీ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించి పార్కులో మొక్కలు నాటారు.
వెంగళరావునగర్/జూబ్లీహిల్స్: ఏడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని గురువారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. జీహెచ్ఎంసీ సర్కిల్లోని కృష్ణకాంత్ పార్కు ప్రాంగణంలో డీఎంసీ రమేశ్ అధ్యక్షతన కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్రెడ్డి, దేదీప్యతో కలిసి మొక్కలు నాటారు. యూసుఫ్గూడ సర్కిల్లో మూడున్నర లక్షల మొక్కలను సిద్ధం చేశారు.