ఎన్నారైలకు మంత్రి వేముల పిలుపు
ఘనంగా ముగిసిన ఆటా మహాసభలు
హైదరాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా ఎదిగిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్నారైలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. తలసరి ఆదాయంలో దేశంలోనే 3వ స్థానంలో, విద్యుత్తు వినియోగంలో మొదటి స్థానంలో తెలంగాణ ఉన్నదని చెప్పారు. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్బుక్ తెలంగాణ అభివృద్ధికి అద్ధం పట్టిందని వివరించారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాధగిరిరెడ్డి, ఆటా ప్రతినిధులు పాల్గొన్నారు.
మూడు రోజుల పండుగ
ఏటా నిర్వహించే ఆటా మహాసభలు కొవిడ్ కారణంగా ఈ సారి రెండేండ్ల విరామం అనంతరం జరిగాయి. వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు నిర్వహించిన వేడుకల్లో సుమారు 15 వేల మంది పాల్గొన్నారు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, చామకూరి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గాదరి కిశోర్, చంటి క్రాంతికిరణ్, రవీంద్రకుమార్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. తొలిరోజు ఈవెంట్కు క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్దేవ్, క్రిస్గేల్ హాజరయ్యారు. రెండో రోజు వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించారు. మూడోరోజు ముగింపు కార్యక్రమానికి వాషింగ్టన్ డీసీ గవర్నర్ హాజరయ్యారు. ఆటా ప్రెసిడెంట్ భుజాల భువనేశ్, కన్వీనర్లు బండారు సుధీర్, బోయినపల్లి అనిల్ తదితరులు నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించారు.
అమెరికాలో ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు
ఫోన్లో శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జన్మదిన వేడుకలు అమెరికాలో సోమవారం ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలలో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి మంత్రి ఎర్రబెల్లి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనకు హైదరాబాద్ నుంచి ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలోనే ఉన్న మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గాదరి కిశోర్, ఎన్నారైలు, ఆటా ప్రతినిధుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వారంతా ఆకాంక్షించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒకరికీ దయాకర్రావు ధన్యవాదాలు తెలిపారు.