Telangana | పదేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోనూ విద్యుత్తు కోతలు. ఎండాకాలం వచ్చిందంటే నరకయాతనే. పవర్ కట్లతో వందలాది పరిశ్రమలు మూతబడేవి. అదే తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిరంతరాయంగా 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ప్రతి ఇంట్లో వెలుగులు నింపుతున్నది. ఈ మార్పునకు కారణం.. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత విద్యుత్తు సంకల్పమే.
75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ఈ ఎర్రటి ఎండల్లో అనేక రాష్ర్టాల్లో విద్యుత్తు కోతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ రాష్ర్టాలు, వందేండ్ల చరిత్ర కలిగిన పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కరెంటు చీకట్లలో మగ్గిపోతున్నాయి. ఒకవైపు దేశమంతా చీకట్లలో మగ్గుతుంటే.. తెలంగాణలో వెలుగుల జిలుగులు ప్రసరిస్తున్నాయి. ఎవరు పనిమంతుడో దీన్నిబట్టి తేలడం లేదా?
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): విద్యుత్తు స్థాపిత సామర్థ్యం, తలసరి వినియోగం, సరఫరా, మిగులు విద్యుత్తు తదితర అంశాలను దేశప్రగతికి కొలమానంగా భావిస్తారు. డిమాండ్కు సరిపడా విద్యుత్తును సరఫరా చేస్తున్నామా లేదా అన్న దానిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అయితే, 75 ఏండ్ల స్వతంత్య్ర భారతావనిలో ప్రజలకు ఇప్పటికీ కరెంటు కష్టాలు తప్పటం లేదు. దేశంలో ఏచోట చూసినా ప్రస్తుతం విద్యుత్తు కష్టాలే. అయితే, సమైక్య రాష్ట్రంలో కరెంటు కష్టాలే తప్ప వెలుగులు చూడని తెలంగాణ బిడ్డలకు.. ఇప్పుడు ప్రతిరోజూ దీపావళిగానే మారింది. సీఎం కేసీఆర్ సంకల్పంతో కరెంటు కోతలు లేని రాష్ట్రంగానే కాదు.. మిగులు విద్యుత్తు, తలసరి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులు సృష్టిస్తున్నది.
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో చిమ్మచీకట్లే రాజ్యమేలేవి. హైదరాబాద్లో రోజూ 2-4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలపాటు విద్యుత్తు కోతలు ఉండేవి. వ్యవసాయానికి 3-4 గంటలపాటు కరెంటు ఇచ్చేవారు. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు. రాష్ట్రంలో మొత్తం డిమాండ్లో 2,700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు సంక్షోభం నుంచి రాష్ర్టాన్ని శాశ్వతంగా బయటపడేసేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను రచించింది. తొలుత ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసి కోతలు లేకుండా చేశారు. సంస్థల అంతర్గత విద్యుత్తు సామర్థ్యం పెంపు, కొత్త విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టారు. వెరసి రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్తును సరఫరా చేసి చరిత్ర సృష్టించారు. కొద్దికాలంలోనే వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును ఇచ్చి రికార్డు నెలకొల్పారు.
దేశవ్యాప్తంగా 2022-23లో విద్యుత్తు వినియోగం 1.5 లక్షల కోట్ల యూనిట్లకు చేరుకొన్నట్టు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా గణాంకాల్లో వెల్లడించింది. దేశంలో తలసరి విద్యుత్తు వినియోగం 1,255 యూనిట్లు ఉండగా తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 2,166 యూనిట్లుగా నమోదైంది. అంటే జాతీయ సగటు కంటే ఇది 73 శాతం ఎక్కువ.
ఒడిశాలోని బర్గాఢ్ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు టార్చ్లైట్ల వెలుగులోనే అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యుత్తు కోతలే దినికి కారణం. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఒడిశా అంతటా పవర్ కట్స్ నిత్యకృత్యమయ్యాయి. దవాఖానలకూ ఈ కోతల ప్రభావం పాకింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పవర్ కట్స్ విధించడంతో నిద్ర కూడా పట్టట్లేదని ఒడిశా వాసులు వాపోతున్నారు.
ఇటీవల ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బరిపడలోని రామచంద్ర భంజదేవ్ వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో 9 నిమిషాల పాటు విద్యుత్తు నిలిచిపోయింది. దీంతో టార్చిలైట్ వెలుతురులోనే రాష్ట్రపతి ప్రసంగాన్ని కొనసాగించడం చర్చనీయాంశమైంది. రాష్ట్రపతి సొంతూరు దుండూర్సాహిలో మొన్నటి వరకు విద్యుత్తు సౌకర్యమే లేదు. ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్నారనగా.. ఆగమేఘాల మీద ఆ కుగ్రామానికి విద్యుత్తు లైన్లు వేశారు.
సాఫ్ట్వేర్ హబ్గా పిలిచే బెంగళూరులో తరుచూ పవర్ కట్స్ ఏర్పడుతున్నాయి. లోడ్పై భారం పెరగడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. కార్యాలయాలు, గృహాలు, స్కూల్స్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ప్రతి రోజు విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. కాగా, కరెంటు లేకపోవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులు మృత్యువాతపడటం బళ్లారి ప్రభుత్వ దవాఖానలో కిందటేడాది సంచలనం సృష్టించడం తెలిసిందే. కరెంటు కోతలతో విసిగివేసారిన పారిశ్రామికవేత్తలు బెంగళూరు ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ (బెస్కాం) అధికారులకు హారతి పట్టి నిరసన తెలియజేయడం నిరుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
విద్యుత్తు కోతలతో వస్తువులను ఉత్పత్తి చేయడం తమకు సాధ్యం కావట్లేదంటూ రాంచీ, రామ్గఢ్తో పాటు పలు జిల్లాల్లోని చిన్న, మధ్యస్థ పరిశ్రమల ప్రతినిధులు జార్ఖండ్ ప్రభుత్వానికి మొర పెట్టుకొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తమకు నష్టాలు వస్తున్నట్టు మండిపడుతున్నారు. రోజులో మూడు నుంచి 15 గంటలపాటు కోతలు విధిస్తే కంపెనీలను ఎలా నడపాలంటూ సర్కారును నిలదీస్తున్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబై, పుణెతో పాటు థానె, నవీ ముంబైని కరెంట్ కష్టాలు చుట్టుముడుతున్నాయి. ముంబై, పుణెలోని సాఫ్ట్వేర్, ఉత్పాదక కంపెనీలు ఉన్న చోట్ల కూడా కరెంటు కోతలు పెరిగిపోయాయి. దీంతో పుణెలో గత గురువారం 12 గంటల్లోనే రూ.350 కోట్ల నష్టం వచ్చినట్టు పరిశ్రమ నిపుణులు తెలిపారు.
యూపీలోని లక్నో, ఘాజియాబాద్ తదితర జిల్లాల్లో విద్యుత్తు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, కరెంట్ను కట్ చేస్తే పిల్లలు, వృద్ధులు ఉష్ణోగ్రతలను ఎలా తట్టుకోవాలని గృహిణులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో పగటిపూటంతా విద్యుత్తు కోతలు కొనసాగుతున్నట్టు వాపోతున్నారు.
గోవాలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతం వెర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో విద్యుత్తు కోతలు పెరిగిపోయాయి. గడిచిన రెండు వారాలుగా విద్యుత్తు కోతలు విపరీతంగా పెరిగిపోయినట్టు వెర్నా ఇండస్ట్రీస్ అసోసియేషన్ (వీఐఏ) ప్రెసిడెంట్ ప్రదీప్ దా కోస్టా తెలిపారు.
మధ్యప్రదేశ్లో రెండు రోజులకొకసారి పవర్ కట్స్ ఉంటున్నట్టు ప్రజలు వాపోతున్నారు. విద్యుత్తు కోతలతో విసిగివేసారిన ఇండోర్ జిల్లాలోని దటోడావాసులు సబ్స్టేషన్కు నిప్పుపెట్టడం కిందటేడాది తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోనూ విద్యుత్తు కోతలు కొనసాగుతున్నాయి. అహ్మదాబాద్, గాంధీనగర్తో పాటు పలు పారిశ్రామిక వాడల్లో పవర్ కట్స్ ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. కిందటేడాది పరిశ్రమలకు వారానికి ఒక రోజు విద్యుత్తు కోత విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర విద్యుత్తు సంస్థ ప్రకటించడం తెలిసిందే. ఈసారి అప్రకటిత కోతలు ఉన్నట్టు పారిశ్రామిక వర్గాలు ఆరోపిస్తున్నాయి.
బీహార్ రాజధాని పాట్నాతో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు గంటలపాటు విద్యుత్తు కోతలు స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పశ్చిమబెంగాల్లోని కోల్కతా వాసులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తమిళనాడు రాజధాని చెన్నైలోనూ కోతలు నిత్యకృత్యంగా మారిపోయాయి.
విద్యుత్తు కోతలతో దేశంలోని కనీసం 85 శాతం ఇండ్లు ప్రభావితం అవుతున్నాయి. రోజులో 2-8 గంటలపాటు విద్యుత్తు కోతలు ఎదుర్కొంటున్నట్టు 37 శాతం మంది వెల్లడించారు. ఈ మేరకు లోకల్సర్కిల్స్ తాజాగా చేసిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లోని 25 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు.