హైదరాబాద్: మణికొండ ఘటన చాలా బాధాకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మణికొండలో గల్లంతైన రజనీకాంత్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్మాణాల వద్ద జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గల్లంతైన వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు.
హైదరాబాద్లో శనివారం రాత్రి రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. దీంతో మణికొండలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో గోపిశెట్టి రజనీకాంత్ (42) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఆయన షాద్నగర్లోని నోవా గ్రీన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఘటనా స్థలానికి 50 మీటర్ల దూరంలోనే రజనీకాంత్ ఇల్లు ఉన్నది. శని రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన.. వర్షపు నీటితో నిండటంతో దారి కనబడకపోవడంతో గుంతలో పడిపోయాడు. రజనీకాంత్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మున్సిపల్ సిబ్బంది గాలిస్తున్నారు.