మెదక్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5 కోట్ల విలువైన గన్నీ బస్తాలు మాయమయ్యాయి. వీటిలో మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్లో పాతవి 8.05 లక్షల గన్నీ బస్తాలకు రూ.2.08 కోట్ల విలువ కాగా, కొత్తవి 3.28 లక్షల గన్నీ బస్తాలకు రూ.2.49 కోట్ల విలువ ఉంటుంది. రామాయంపేటలో 87,830 కొత్త గన్నీ బస్తాలకు రూ.66.68 లక్షలు కాగా, పాతవి 2 లక్షల గన్నీ బస్తాలకు రూ.52.52 లక్షల విలువ ఉంటుంది. ఇవన్నీ కన్పించకుండా పోయాయని సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు.
కొన్నేండ్లుగా గన్నీ బస్తాల గోల్మాల్ జరుగుతున్నట్టు తెలిసింది. 50 సంచుల కట్టలు కట్టి ఇవ్వాల్సిన ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు, వారి ఇష్టారీతిగా గన్నీ బస్తాలను సరఫరా చేస్తుండటంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నట్టు సమాచారం. మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్ అధికారి నర్సింలుపై ఇటీవల క్రిమినల్ కేసు, రామాయంపేట ఎంఎల్ఎస్ పాయింట్ డీటీ సతీశ్పై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా, పౌరసరఫరాల శాఖ ఒక్కో కొత్త గన్నీ బస్తాను రూ.75.92 చొప్పున ధరకు కొనుగోలు చేసింది. పాత బస్తాను రూ.26కు కొనుగోలు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో మాయమైన గన్నీ బస్తాలు కొనుగోలు కేంద్రం నిర్వాహకుల వద్ద ఉన్నాయా? లేక ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు ఎవరికైనా విక్రయించారా? అనే విషయాలపై అధికారులు విచారించాల్సి ఉన్నది.
మెదక్ జిల్లాలో ఇప్పటివరకు నాలుగు ఎంఎల్ఎస్ పాయింట్లపై కేసులు నమోదు చేశాం. ఇందులో మెదక్, రామాయంపేట, తూప్రాన్, చేగుంట ఎంఎల్ఎస్ పాయింట్ల అధికారులపై కేసులు నమోదయ్యాయి. మెదక్, రామాయంపేటలో సుమారు 15 లక్షల గన్నీ బస్తాలు మాయమయ్యాయి. వాటి విలువ సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఈ గోల్మాల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించం. చట్టప్రకారం వారి ఆస్తులు జప్తు చేస్తాం.
– డీ హరికృష్ణ, మేనేజర్, పౌరసరఫరాల శాఖ, మెదక్ జిల్లా