Congress | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): హలో! ఎవరైనా ఉన్నారా? రండి.. వచ్చి కాంగ్రెస్లో చేరండి.. మంచి తరుణం మించితే దొరకదు అంటూ కాంగ్రెస్ చేరికల కమిటీ చేసిన ప్రకటన మూన్నాళ్ల ముచ్చటే అయింది. టీపీసీసీ చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేసింది. అయితే ఇది ఏర్పడి వారం రోజులు తిరక్కముందే ఇకపై తమ సమక్షంలో చేరికలు ఉండవని, చేరాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీనే సంప్రదించాలంటూ చేతులు ఎత్తేసింది.
అసలు ఏం జరిగింది? ఎవరైనా వచ్చి కాంగ్రెస్లో చేరవచ్చని ఆహ్వానించి హడావుడి చేసిన కమిటీ వెనక్కి తగ్గడానికిగల కారణం ఏమిటి? అని పార్టీలో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్లో చేరికల కథాకమామిషు ఏమిటని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేరికల కోసం ముగ్గురితో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి అందులో తమను నియమించి, తీరా పరువు తీశారని వారు వాపోతున్నారు.
అధిష్ఠానం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది కాబట్టి పార్టీలో ఎవరైనా చేరవచ్చని ప్రకటన ఇస్తే.. ఇప్పుడేమో, ఎవడంటే వాడి మెడలో పార్టీ కండువా కప్పుతారా? అని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో చేరికల కమిటీ కంగుతిన్నది. పొద్దున పార్టీలో చేర్చుకోవడం.. సాయంత్రానికి వారి చేరికలను నిలిపివేసినట్టు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి నుంచి ప్రకటన రావడం నిత్యకృత్వంగా మారింది. ఇది తమ పరువు తీసినట్టు అవుతున్నదని చేరికల కమిటీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇక నుంచి పార్టీలో ఎవరైనా చేరాలనుకుంటే నేరుగా దీపాదాస్ మున్షీని కలవండి అని చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి ప్రకటించి చేతులు దులుపుకున్నారు.
గేట్లు తెరిచినా..ఫలితం లేదని…
కాంగ్రెస్లో చేరికలకు గేట్లు తెరిచినట్టు పార్లమెంట్ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించినప్పటికీ పెద్దగా చేరికలు జరుగలేదు. పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలే కాకుండా చోటామోటా నాయకులు వచ్చినా చేర్చుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీల నుంచి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని పీసీసీని ఆదేశించి వెళ్లారు. ఈ మేరకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్కుమార్ గౌడ్, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండారెడ్డితో చేరికల కమిటీ ఏర్పాటు చేశారు. ఎవరైనా వచ్చి కాంగ్రెస్లో చేరవచ్చు.. కండువాలు కప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నామని కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి ప్రకటించారు.
పొద్దున చేరికలు.. సాయంత్రం నిలిపివేత
కొందరు చోటామోటా నాయకులతోపాటు గత ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ దక్కక పార్టీకి రాజీనామా చేసిన నాయకులు, తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారు గాంధీభవన్కు వస్తే చేరికల కమిటీ వారికి కండువాలు కప్పింది. అలా చేరిన వారిలో దేవరకద్ర నుంచి అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ ఆశించి భంగపడి పార్టీకి రాజీనామా చేసిన కే ప్రదీప్గౌడ్ ఒకరు.
ఈయన పార్టీలో చేరిన రోజు సాయంత్రమే ఆయన చేరికను నిలిపేసినట్టు దీపాదాస్ మున్షీ ప్రకటించారు. తనకు టికెట్ రాలేదన్న అక్కసుతో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన నాయకుడిని తిరిగి ఎలా చేర్చుకుంటారని స్థానిక ఎమ్మెల్యే, మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనతో సంప్రదించకుండా చేర్చుకోవడాన్ని నిరసిస్తూ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో దిక్కుతోచని దీపాదాస్ మున్షీ ఈ చేరికను నిలిపివేయక తప్పలేదని చెప్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ, 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో వచ్చి గాంధీభవన్లో చేరికల కమిటీతో పార్టీ కండువా కప్పుకున్నారు.
వీరి చేరిక కూడా సేమ్ టు సేమ్ మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. తమను సంప్రదించకుండా ఎలా చేర్చుకున్నారని వారు దీపాదాస్ మున్షీకే నేరుగా ఫోన్ చేసి నిలదీసినట్టు సమాచారం. దీంతో వీరి చేరికను కూడా నిలిపేసినట్టు ఆమె ప్రకటించక తప్పలేదు.
భువనగిరి నియోజకవర్గానికి చెందిన గోడ శ్రీనివాస్గౌడ్, రాహుల్ గౌడ్, చిన్నం శ్రీనివాస్ గౌడ్ తదితరులు కూడా చేరికల కమిటీ ప్రకటనతో గాంధీ భవన్కు వచ్చి పార్టీ కండువా కప్పుకున్నారు. తనతో సంప్రదించకుండా వీరిని ఎలా చేర్చుకున్నారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ మండిపడటంతో వీరి చేరికలను కూడా నిలిపివేశారు.
మాకొద్దు.. ఈ కమిటీ
పొద్దున కండువా కప్పడం.. సాయంత్రానికి వారి చేరికలను నిలిపేసినట్టు దీపాదాస్ మున్షీ ప్రకటించడంతో తాము చేరికల కమిటీ నుంచి తప్పుకుంటున్నట్టు సభ్యులు ముగ్గురు చెప్పారు. ఇక నుంచి ఎవరైనా పార్టీలో చేరదల్చుకుంటే నేరుగా దీపాదాస్ మున్షీనే సంప్రదించాలని జగ్గారెడ్డి పత్రికాముఖంగా ప్రకటించారు.