ఆరోపణలపై ఎవరితో విచారణకైనా సిద్ధం
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఖమ్మం ప్రజలు భయపడరని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ప్రశ్నించేతత్వం, నిజాయితీగల వ్యక్తిత్వం జిల్లా ప్రజల సొంతమని చెప్పారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏ విచారణ కోరుకున్నా తాను సిద్ధంగా ఉన్నానని, బ్లాక్మెయిల్ రాజకీయాలకు తలవంచేదిలేదని స్పష్టంచేశారు. ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్లతో కలిసి ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో మంగళవారం పువ్వాడ మీడియాతో మాట్లాడారు.
తమ వైద్యవిద్యాసంస్థలు జిల్లా ప్రజలకు ఎలాంటి వైద్య సేవలందించాయో అందరికీ తెలుసునని, కొవిడ్ సమయంలోనూ వైద్యసేవలు అందించిన ఘనత తమ విద్యాసంస్థలకు ఉందని చెప్పారు. రేవంత్రెడ్డి సవాళ్లకు నిలబడే వ్యక్తి కాదని, 2018 ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతానని ప్రకటించిన రేవంత్.. ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లో ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక విచారణల పేరుతో భయపెట్టాలని భావిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
రేవంత్వన్నీ అబద్దపు ప్రచారాలే: మంత్రి కొప్పుల
యాత్ర పేరుతో రేవంత్రెడ్డి జిల్లాలకు వెళ్తూ అబద్దపు ప్రచారాలు చేస్తూ టీఆర్ఎస్పై అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. వానకాలం, యాసంగి పంటలకు తేడా తెలియనట్టుగా రేవంత్రెడ్డి వ్యవహారశైలి ఉన్నదని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీతో శత్రుత్వంగా, రాష్ట్రంలో మిత్రుత్వంగా ఉన్న కాంగ్రెస్ వింత ధోరణిపై రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధును అమలుచేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు.