నారాయణపేట : ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందజేయని ఓ రైస్మిల్ యజమానిపై నాన్ బెయిలబుల్ కేసు(Non-bailable case) నమోదు చేసినట్లు నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష (Collector Koya Sriharsha) తెలిపారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో గల సాయికృష్ణ రైస్ మిల్ను(Saikrishna Rice Mill) ఇటీవలే జిల్లా కలెక్టర్ శ్రీహర్ష జిల్లా అదనపు ( రెవెన్యూ) కలెక్టర్ అశోక్ కుమార్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో రైస్ మిల్ యజమాని రాజేందర్ రెడ్డి ప్రభుత్వానికి అందజేయాల్సిన 1.8 కోట్ల విలువగల సీఎంఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు కలెక్టర్ గుర్తించారు. దీనిపై జిల్లా కలెక్టర్ రైస్ మిల్ యజమానిపై ధన్వాడ పోలీస్ స్టేషన్లో సివిల్ సప్లై డీఎం దేవస్తో ఫిర్యాదు చేయించారు.
ఈ మేరకు ధన్వాడ పోలీసులు రైస్మిల్ యజమాని రాజేందర్ రెడ్డి పై ఎఫ్ఐఆర్ చేసి నాన్ బైలబుల్ కేసు నమోదు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని మిల్లర్లు ప్రభుత్వానికి నిర్దేశించిన మేర సీఎంఆర్ బియ్యం సరఫరా చేయకుండా పక్కదారి పట్టించినట్లు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైస్ మిల్లర్లు సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.