మేము సామాన్యమైన మనుషులం. భగవంతుడు ఆయనే పని చేయించుకుంటడు. మ్యాన్ ప్రపోజెస్.. గాడ్ డిస్పోజెస్. భగవంతుడి దయ శ్రీనన్న మీద వచ్చింది. నన్ను పిలిపించుకుని ఆయనే పని చేయించుకున్నాడు. స్వామి కరుణ, దయ బాన్సువాడ మీదనే కాదు. మొత్తం రాష్ట్రంపై ఉండాలి. పంటలతో సుభిక్షంగా ఉండాలి. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి.
– ముఖ్యమంత్రి కేసీఆర్
నిజామాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజాంసాగర్ ప్రాజెక్టు ఇక ఎప్పటికీ ఎండిపోదని, పచ్చగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశ్వాసం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నిజాంసాగర్ నీటి గోస తీరిందని వివరించారు. ఈ ప్రాంత ప్రజలు ధైర్యంగా రెండు పంటలు పండించుకొని, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు బయలుదేరినప్పుడు తనను కదిలించిన అనేక సంఘటనల్లో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు దుస్థితి కూడా ఒకటని గుర్తుచేసుకున్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఆయకట్టు రైతులకు జరిగే అన్యాయం కండ్లారా చూశానని చెప్పారు.
వందేండ్ల క్రితం కట్టిన నిజాంసాగర్ ప్రాజెక్టును నాటి పాలకులు నిర్లక్ష్యం చేయడం ద్వారా ఈ ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు తన సతీమణి శోభతో కలిసి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వామివారికి రెండున్నర కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబం, దాతలతో కలిసి రూపొందించిన కిరీటాన్ని స్వామివారికి సీఎం దంపతులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో స్పీకర్ దంపతులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కొండ కింద ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు, తిమ్మాపూర్ ఆలయానికి మరో రూ.7 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ఆత్మీయ వ్యక్తి శ్రీనన్న
ఈ మట్టిలో పుట్టి పెరిగిన బిడ్డ పోచారం శ్రీనివాసరెడ్డి. ఆత్మీయత గల వ్యక్తి. మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ జరుగుతున్నది. నాకు స్పీకర్ నుంచి ఫోన్ వచ్చింది. సాలంబీన్ అలీం అనే నా మిత్రుడు చనిపోయాడు. ఎైట్లెనా బాన్సువాడ పోయి రావాలే అని చెప్పగానే ప్రభుత్వ హెలీకాప్టర్ ఇచ్చి పంపించినా. అంత ఆత్మీయత గల వ్యక్తి పోచారం. అప్పట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వచ్చింది. గాంధారి రోడ్డులో బాన్సువాడ వస్తుండగా బర్ల మంద అడ్డం వస్తే ఆగినం. ఇరువైపులా అద్భుతమైన మక్క చేన్లు కనిపించినయి. నన్ను గుర్తు పట్టి నా దగ్గరికి లంబాడా ప్రజలు వచ్చిండ్రు. శ్రీనన్న గెలుస్తాడని చెప్పిండ్రు. ప్రచారానికి పోతున్నా.. మీరు రారా? అని అడగంగనే బర్లు, ఎడ్లను వదిలేసి వస్తాం సార్ అంటూ గిరిజనులంతా బాన్సువాడకు వచ్చిన సందర్భం యాదికి వస్తున్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చిన్న పిల్లవాడి లాగా తన నియోజకవర్గం అంటే వినయంగా, విధేయతగా స్పీకర్ హోదాను మరిచి బాన్సువాడకు శ్రీనన్న సేవ చేస్తున్నడు. ఇప్పుడున్న ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు బోధన్లో సబ్ కలెక్టర్గా పని చేసిండు. అప్పుడు శ్రీనన్న బాన్సువాడలో నిజాంసాగర్ నీళ్ల కోసం ధర్నా చేసినప్పుడు అన్న మాటలను నాకు చెప్పిండు. బతికున్నప్పుడు మంచినీళ్లు, గంజినీళ్లు ఇయ్యుండ్రి. సచ్చినంక బిర్యాని ఇస్తే ఏం లాభమని పోచారం చెప్పిన మాటలు నాక్కూడా యాదికి వస్తున్నాయి.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం తిమ్మాపూర్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి రెండు కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించేందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. చిత్రంలో ఆయన సతీమణి శోభ, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, డాక్టర్ పోచారం రవీందర్రెడ్డి, పోచారం సురేందర్రెడ్డి తదితరులు
నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా..!
వయసు పెరుగుతుందని శ్రీనన్న అంటున్నారు. నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా. 69 ఏండ్లు వచ్చినయి. నేను ఉన్నన్ని రోజులు మీరు ఉండాల్సిందే. బాన్సువాడకు సేవ చేయాల్సిందే. మీ మాట బలంగా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడి పనులు చేయించుకునే గొప్పతనం ఉన్నది. నిజాయితీగా ప్రజల కోసం పాటుపడే వ్యక్తి మీరు. గుట్టపైకి వచ్చేటప్పుడు బస్సులో గర్వంగా, సంతోషంగా తాను సాధించిన ప్రగతిని చెప్తున్నారు. శ్రీనన్నపై ఉన్న ఆదరాభిమానాలతో ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నాను. ఈ పైసలతో బాన్సువాడ అభివృద్ధికి ఖర్చు పెట్టుకోవాలని కోరుతున్నా. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు గుడి ఒక మాదిరిగా ఉండేది. అందమైన, ప్రకృతి రమణీయత మధ్య చక్కని స్థలంలో ఉన్నది. గుట్ట పైకి శిఖరానికి పోయినప్పుడు చుట్టూ సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం కనిపించేట్టు ఉన్నది.
ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న గుడిని మరింత అభివృద్ధి చేయాలనే శ్రీనన్న నన్ను ఇక్కడికి తీసుకు వచ్చిండు. తప్పక అభివృద్ధి చేద్దాం. మనసుకు చాలా సంతోషంగా ఉన్నది. కొద్ది మంది మిత్రులతో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డిగారే ఈ సత్కార్యాన్ని చేసినారు. ఆయన కోరుకున్న దాని కన్నా చాలా బాగా పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నది. మేము సామాన్యమైన మనుషులం. భగవంతుడు ఆయనే పని చేయించుకుంటడు. మ్యాన్ ప్రపోజెస్.. గాడ్ డిస్పోజెస్. భగవంతుడి దయ శ్రీనన్న మీద వచ్చింది. నన్ను పిలిపించుకుని ఆయనే పని చేయించుకున్నాడు. స్వామి కరుణ, దయ బాన్సువాడ మీదనే కాదు. మొత్తం రాష్ట్రంపై ఉండాలి. పంటలతో సుభిక్షంగా ఉండాలి. ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలి. ఇప్పటివరకు ఈ ఆలయానికి రూ.23 కోట్లు ఇచ్చాం. ఇంకా రూ.7 కోట్లు ఇస్తాం. ఇక్కడ పెండ్లిళ్లు బాగా జరుగుతున్నాయి. గుడి అంటే కమ్యూనిటీ కేంద్రంగా ఉండాలి. ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలి.
తిమ్మాపూర్లోని శ్రీవేంకటేశ్వరస్వామివారికి బంగారు కిరీటాన్ని తొడుగుతున్న వేద పండితులు
పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను కూడా టీడీపీలోనే ఉన్నా. నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర ఏడు రోజులు కొద్ది మందితో కలిసి నిరాహార దీక్ష చేశారు. అప్పుడు పరిస్థితిని తెలుసుకునేందుకు నేనే వచ్చినా. సింగూర్ ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్కు నీళ్లు రావాలని దీక్ష సందర్భంలో నిజామాబాద్ వచ్చినప్పుడు నా దృష్టికి విషయం చేరింది. వాస్తవాన్ని కనుక్కుంటే సమైక్య పాలకుల ద్రోహం తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముం దు మంజీర మీద 50 టీఎంసీలతో దేవనూర్ వద్ద ప్రాజెక్టు కట్టాలని ప్రతిపాదించారు. ఏపీ ఏర్పాటు తర్వాత ఈ ప్రతిపాదన రద్దయ్యింది. 50 టీఎంసీల ప్రాజెక్టును కాస్త 30 టీఎంసీలకు కుదించి సింగూర్ ప్రాజెక్టును కట్టారు.
హైదరాబాద్కు మంచి నీళ్ల పేరిట సింగూర్ నీళ్లను దారాదత్తం చేశారు. ఆయకట్టుకు నీళ్లు ఇయ్యలేదు. ఎమ్మెల్యేలు నిరాహార దీక్షలు చేశారు. ఆనా డు ఈ ప్రాంతం అనుభవించిన దుర్భర పరిస్థితిని నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. నిజామాబాద్తోపాటు పక్కనే మెదక్ జిల్లాలో ఘన్పూర్ ఆయకట్టు ఉంటది. దీనికి మంజీరనే ఆధారమైనా నీళ్లు అందేది కాదు. వందేండ్ల క్రితం కట్టిన నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఎంతో బాధ ఉండేది. పరిష్కారం ఏమిటి? అని ఆలోచన చేసినం. ఏపీ లో పరిష్కారం కాలేదు. అప్పటి పెద్దలతో చెప్పినం. మాట్లాడినం. పరిష్కా రం కాలేదు. తృణీకార భావనతో మా ట్లాడారే తప్ప పరిష్కారం చూపలేదు.
తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుమల క్షేత్రానికి వచ్చిన సీఎం కేసీఆర్ దాదాపుగా రెండున్నర గంటల పాటు పర్యటన సాగించారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కొండపైకి వాహనంలో వెళ్తున్న సందర్భంలో స్పీకర్ పోచారం బాన్సువాడ అభివృద్ధి గురించి సీఎం కేసీఆర్కు వివరించారు. తిమ్మాపూర్ అలిపిరి ఘాట్ వద్దకు చేరుకోగానే గుట్ట ప్రాంతం రెవెన్యూ పరిధిలో ఉన్న విషయాన్ని స్పీకర్ ప్రస్తావించారు. ఈ భూమిని తెలంగాణ తిరుమల క్షేత్రానికి బదలాయిస్తే ఆలయ అభివృద్ధికి దోహదపడుతుందని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అచ్చంగా తిరుమల అలిపిరి ఘాట్ను పోలిన ఈ మార్గంలో పయనిస్తున్న సందర్భంలో ప్రకృతి సోయగాన్ని చూసి కేసీఆర్ మంత్రముగ్ధులయ్యారు. అక్కడి పచ్చదనాన్ని చూసి ఆలయ అభివృద్ధి అద్భుతంగా జరగాలని ఆకాంక్షించారు. స్పీకర్ విన్నపాన్ని ఆలకించిన ముఖ్యమంత్రి వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్చేసి భూ బదలాయింపు విషయంపై చర్చించారు.
ప్రస్తుతం గుట్టపైకి వెళ్తున్నానని, గుట్ట దిగి కిందికి వచ్చేలోపు జీవో జారీ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల కొండ దిగి కృతజ్ఞత సభకు చేరుకున్నది. స్పీకర్ ప్రసంగిస్తుండగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని జీవో విషయమై కేసీఆర్ పురమాయించారు. సభా వేదిక దిగిన మంత్రి నేరుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి జీవో నకలును వేదికపైకి పట్టుకొచ్చారు. 66 ఎకరాల రెవెన్యూ భూమిని తెలంగాణ తిరుమలకు బదలాయించిన కాపీని ముఖ్యమంత్రికి ప్రశాంత్రెడ్డి అందివ్వగా… స్పీకర్కు ఇవ్వాలని సూచించారు. అప్పటికే ప్రసంగం మొదలు పెట్టిన స్పీకర్ పోచారం తన చేతికి వచ్చిన జీవోను చూసి మురిసిపోయారు. గంట సేపట్లోనే సీఎం హామీ నెరవేరిందని, ఇలాంటి ప్రభుత్వాలు గతంలో ఎప్పుడైనా చూశామా? అంటూ ఆశ్చర్యచకితులయ్యారు. సభా వేదిక నుంచి సీఎం కేసీఆర్కు స్పీకర్ ధన్యవాదాలు తెలియజేశారు.
తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ కోసం దేశ ప్రజలు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. కేసీఆర్ ఆశీస్సులతోనే రూ.23 కోట్లతో తెలంగాణ తిరుమల ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నట్టు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గానికి 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారని వివరించారు. తాను జీవించినంత కాలం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని స్పష్టంచేశారు. మాట ఇచ్చిన వెంటనే గంటల్లోనే జీవో ఇచ్చిన సీఎం కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. బాన్సువాడలో హెలికాప్టర్ దిగిన తరువాత వెంకన్న సన్నిధి కోసం 66 ఎకరాల స్థలం కావాలని తాను సీఎంను కోరిన గంటలోనే ప్రభుత్వం జీవో జారీ చేసిందని వివరించారు. ఇలాంటి జీవోల కోసం గతంలో ఏండ్లు పట్టేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రజల కోసం ఇంత వేగంగా పని చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. మా రైతులకు సాగు నీళ్లు లేవని ఫోన్ కొడితే నీళ్లు విడుదల చేయించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కీర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో గోదావరి జలాలను నేరుగా నిజాంసాగర్కు మళ్లించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి గొప్పదని ప్రశంసించారు. నిజాంసాగర్లో నీటి మట్టం తగ్గగానే కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. ఇక నిజాంసాగర్కు నీటి కరువు ఉండదని చెప్పారు. నియోజకవర్గంలోనే 1,600 కోట్ల పంట పండుతున్నదంటే దానికి తెలంగాణ ప్రభు త్వం, సీఎం కేసీఆర్ దార్శనికతనే కారణమన్నారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, విప్ గంప గోవర్ధన్, ఎంపీలు సురేశ్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, జీవన్రెడ్డి, జాజాల సురేందర్, బిగాల గణేశ్గుప్తా, సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, వీజీ గౌడ్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి పాల్గొన్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం సీఎం కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం స్టాలిన్ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.