హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో వామపక్షాల సీట్ల విషయంలో ఎలాంటి అవగాహన కుదరలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ వెల్లడించారు. హైదరాబాద్ మఖ్దూంభవన్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరుపక్షాల నడుమ చర్చలు జరుగుతున్నాయని, ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని హితవు పలికారు. సీపీఐ, సీపీఎం చెరి ఐదు సీట్ల చొప్పున ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్కు జాబితాలు అందజేసినట్టు వివరించారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నా, కొన్నిచోట్ల కలిసి, మరికొన్ని చోట్ల విభేదించుకుంటున్నాయని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్కు ఆరు నెలల ముందు నుంచే ఎలాంటి ఎన్నికల హామీలు, వరాలు, పథకాలు ప్రకటించకుండా, అధికారుల బదిలీలు చేపట్టకుండా నిరోధించాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు నారాయణ సూచించారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్కు మంగళవారం లేఖ రాసినట్టు తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, ఈటీ నర్సింహ పాల్గొన్నారు.