నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 28: ఇంధనం కొరత వల్ల రాష్ట్రంలో వాహనదారులు ఇబ్బందులు పడు తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యు ద్ధం కొనసాగుతుండ టం, చమురు నౌకలు తగినన్ని చేరుకోకపోవడం, దానికితోడు ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన వెంటనే చమురు ధరలను కేంద్రం భారీగా పెంచనుందనే కథనాలు వెలువడిన నేపథ్యంలో ఒక్కసారిగా తీవ్రమైన ఆయిల్ కొరత ఏర్పడింది. దీంతో రాత్రికి రాత్రే ‘నో స్టాక్’ అంటూ చాలామంది బంకుల యజమానులు బోర్డులు పెట్టారు. దీంతో దాదాపు అన్ని బంక్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారుల క్యూలు దర్శనమిస్తున్నాయి.

బంక్ల వద్ద వాహనాలు భారీగా క్యూలు కట్టడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా పోలీసులు విధులు నిర్వర్తించారు. కాగా, సకాలంలో డీడీలు చెల్లించిన కొందరు యజమానులకు మాత్రమే ట్యాంకర్లు వచ్చాయి. దీంతో ఆయా బంకులు తెరుచుకున్నప్పటికీ.. జనం రద్దీ దృష్ట్యా వాటిల్లోనూ వెనువెంటనే నిల్వలు అయిపోతున్నాయి. ఇప్పటికే ఉన్న నిల్వలు అయిపోయాక వచ్చే స్పష్టతను బట్టి తదుపరి డీడీలు చెల్లించవచ్చుననే ఆలోచనతో చాలామంది డీలర్లు.. చమురు సంస్థలకు ముందస్తుగా డీడీలు చెల్లించలేదు.

మానవపాడు, ఏప్రిల్ 28 : నిబంధనలు పెట్టడమే ఆలస్యం.. వాటిని దాటడానికి మాస్టర్ ప్లాన్ వేస్తుంటారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడుకు చెందిన అల్తాఫ్ కూడా ఇలాగే చేశాడు. బైక్లో పెట్రోల్ అయిపోయిందంటూ బాటిల్ పట్టుకొని బంక్కు వెళ్లగా బంక్ సిబ్బంది పెట్రోల్ పోయలేదు. అంతే అల్తాఫ్ అక్కడి నుంచి వెళ్లి తన బైక్ ట్యాంక్ పూర్తిగా విప్పేశాడు. తర్వాత స్నేహితుడి బండిపై పెట్రోల్ బంక్కు వెళ్లాడు. ఇది బాటిల్ కాదు కదా.. ఇప్పుడు పెట్రోల్ పోయండి.. అం టూ అడగడంతో సిబ్బంది అవాక్కయ్యారు. చేసేది లేక ట్యాంక్లో పెట్రోల్ పోశారు. ఈ ట్యాంక్ ఫొటోలు నెటిజన్లను నవ్విస్తున్నాయి. ‘సాధించావు బిడ్డా’.. అని కొందరు వీడియోలను వైరల్ చేస్తున్నారు.