హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. బంకుల ముందు క్యూ కట్టిన వాహనదారులు.. ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్.. ఒక్క మాటలో చెప్పాలంటే వాహనదారులు పట్టపగలే ప్రత్యక్ష నరకం చూశారు. ఇదీ మంగళవారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాల్లో కనిపించిన పరిస్థితి. హిట్ అండ్ రన్ కేసులో శిక్షణ పెంచుతూ కేంద్రం తెచ్చిన సవరణను వ్యతిరేకిస్తూ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్లు మంగళవారం మధ్యాహ్నం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. దీంతో పెట్రోల్ బంకులకు ఎక్కడికక్కడ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పరుగులుపెట్టారు. కొద్ది సమయంలోనే పెట్రోల్ బంకులన్నీ వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో వాహనదారులు పెట్రోల్ కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. నగరం మొత్తం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోవడం గమనార్హం. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు ఇదే పరిస్థితి కనిపించింది.
రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్ల సమ్మె ప్రభావం పడింది. ఏ పెట్రోల్ బంకులో చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను రూ. 6-10 వరకు తగ్గించే అవకాశం ఉందనే సమాచారంతో బంకుల యజమానులెవరూ ఎక్కువ స్టాక్ పెట్టుకోలేదు. ఒకవేళ ధరలు తగ్గిస్తే తమకు నష్టం వస్తుందనే ఉద్దేశంతో 30, 31వ తేదీల్లో అవసరం కన్నా తక్కువగానే యజమానులు పెట్రోల్ స్టాక్స్ తెప్పించుకున్నారు. దీంతో సమ్మె ప్రభావం వాహనదారులపై వెంటనే చూపింది.
ప్రజలు అవస్థలు పడటంతో ట్యాంకర్స్ అసోసియేషన్ స్పందించింది. బిల్లును పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిద్దామని పెట్రోల్-డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి పిలుపునివ్వడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి ట్యాంకర్లు బయటికి కదిలాయి.
పెట్రోల్ కొరత తీవ్రమై పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆయిల్ కంపెనీల అధికారులతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ సమావేశం నిర్వహించి, పరిస్థితిపై సమీక్షించారు. పెట్రోల్ కొరత లేకుండా చూసి వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాహనదారులెవరూ ఆందోళన చెందొద్దని, కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన సూచించారు.