Medak | మెదక్, మార్చి 10(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజూ అందించే అన్నం, కూరలు నాసిరకంగా ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల సరిగా ఉడకని అన్నం, రుచిలేని కూరలతో భోజనం పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు.
గురుకులాల్లో విద్యార్థులకు పోషకాహారం అందించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, అమలు మాత్రం సరిగ్గా జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొంతమంది నిర్వాహకులు, సిబ్బంది తక్కువ ఖర్చుతో నాసిరకం సరుకులు తెచ్చి భోజనం తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గురుకులాలు, వసతిగృహాల్లో అవినీతి అక్రమాలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు, ప్రజలు అంటున్నారు.
గురుకులాల్లో బాధ్యతగా పనిచేయాల్సిన కొందరు అధికారులు కూడా ఈ అక్రమాలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల సంక్షేమాన్ని పక్కనబెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గురుకులాలు, వసతిగృహాల్లో పరిస్థితులను సమీక్షించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రేగోడు కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల, నర్సాపూర్ లోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. జిల్లా అధికారులు సంక్షేమ వసతి గృహాల్లో జరుగుతున్న అవినీతి అక్రమ లపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.