CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని, ప్రజలకు అంత రాయం లేకుండా విద్యుత్ను అందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, పంటలు ఎండిపోకుండా చూడాలని సూచించారు. విద్యుత్, తాగునీటిపై శనివారం సీఎం రేవంత్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘వేసవికాలం కావడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. డిమాండ్కు తగ్గట్టు సరిపడా విద్యుత్ ఉన్నది. కాబట్టి డిమాండ్ను తీర్చే విధంగా అధికారులు సన్నద్ధం కావాలి. ఎక్కడైనా కరెంటు సమస్య ఉంటే తక్షణమే పరిష్కరించాలి. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ సరఫరాపై అధికారులు ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలి. కరెంటు పోయిందన్న ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలి’ అని సూచించారు. గత ఏడాదిని మించి ఈ ఏడాది విద్యుత్తును సరఫరా చేయటంలో రాష్ట్రం కొత్త రికార్డును నమోదు చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెలలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోతల్లేకుండా విద్యుత్ను అందించటంలో డిసంలు సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయని సీఎం ప్రశంసించారు. ఇందుకు కృషిచేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమారను అభినందించారు.
ప్రజలు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా గల నీటి వనరులను ఉపయోగించుకోవాలన్నారు. బావుల్లోని నీటిని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని సూచించారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. సమస్యలున్న చోట పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో తాగునీటి కొరతను అధిగమించేందుకు వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో సగటున 9,712 మెగావాట్ల విద్యుత్తు లోడ్ నమోదువుతున్నదని, పీక్ డిమాండ్ గత రెండు వారాలుగా 14వేల మెగా వాట్ల నుంచి 15వేల మెగావాట్లుగా ఉంటున్నదని చెప్పారు. ఏప్రిల్ నెల రెండో వారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని విద్యుత్తు అధికారులు అంచనా వేశారు. నిరుడు (2023) జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం కాగా, 2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో రోజుకు సగటున 251.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా జరిగింది. గతేడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల సరఫరా అత్యధిక రికార్డు కాగా.. ఈ ఏడాది 308.54 మిలియన్ యూనిట్లతో కొత్త రికార్డు నమోదైంది.