హైదరాబాద్, జనవరి 3: కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లోని అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ఠపరచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఇతర వైద్యాధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. ప్రస్తుతమున్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షకిట్లకు అదనంగా అవసరంమేరకు మరిన్ని సమకూర్చుకోవాలని దిశానిర్దేశంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు హైదరాబాద్ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. కొవిడ్ విస్తరించే ప్రమాదమున్నదని, అయినప్పటికీ కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం లాక్డౌన్ విధించే పరిస్థితులులేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం విధించిన ఆంక్షల మేరకు ప్రజలు గుంపులుగా గూమిగూడకుండా, బహిరంగసభలు, ర్యాలీలు లేకుండా నియంత్రించాలని విజ్ఞప్తిచేశారు. ప్రతి ఒకరూ మాస్లు ధరించడంతోపాటు కొవిడ్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించడంద్వారా కరోనాను నియంత్రించవచ్చని వైద్యాధికారులు సీఎం కేసీఆర్కు నివేదించారు.
కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలి
ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరంలేదని, అదే సందర్భంలో అజాగ్రత్త పనికిరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని పిలుపునిచ్చారు. పనిచేసే దగ్గర అప్రమత్తంగా ఉంటూ మాస్లు ధరించాలని, ప్రభుత్వం జారీచేసే కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లతో కరోనాను ఎదురొనేందుకు సంసిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు.
100 శాతం ఆక్సిజన్ బెడ్లు
ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మొత్తం బెడ్లలో దాదాపు 99 శాతం ఆక్సిజన్ బెడ్లుగా మార్చారని, మిగిలిన వాటిని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతంలో 140 మెట్రిక్ టన్నుల సామర్థ్యం మాత్రమే ఉన్న ఆక్సిజన్ ఉత్పత్తిని 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగామని, ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని వైద్యశాఖాధికారులను ఆదేశించారు. హోం ఐసొలేషన్ చికిత్స కిట్లను 20 లక్షల నుంచి ఒక కోటి లభ్యతకు చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని సీఎం ఆదేశించారు. అన్ని దవాఖానాల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని, ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని సీఎం వైద్యాధికారులను ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాల రీత్యా జనాభా ప్రాతిపదికన, రాష్ట్రంలో డాక్టర్లు, బెడ్లు మౌలిక వసతులను పెంచుకొని వైద్యసేవలను మెరుగుపరచాలని సీఎం అన్నారు. నూతనంగా నిర్మించుకొన్న సమీకృత కలెక్టర్ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్ కార్యాలయాలను, ఆయా శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్యశాఖ అవసరాలకోసం ప్రత్యేకించి కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న డయాలిసిస్ సేవలను మరింత విస్తరించాలని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది కిడ్నీ రోగులకు డయాలిసిస్ సేవలు అందుతున్న నేపథ్యంలో డయాలిసిస్ మిషన్లను మరిన్ని పెంచాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా బస్తీ దవాఖానలు
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానల సంఖ్యను మరింతగా పెంచాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు టీ హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తకెళ్లపల్లి రవీందర్రావు, వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఏ జీవన్రెడ్డి, హన్మంత్షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, అధికారులు శ్రీనివాసరావు, రమేశ్రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బస్తీ దవాఖానలు ఎక్కడెక్కడంటే..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ కంటోన్మెంట్జోన్లో 6 (వార్డుకొకటి), వరంగల్ కార్పొరేషన్లో 4, నిజామాబాద్లో 3, రసూల్పుర, రామగుండం, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండలో రెండు చొప్పున, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, మలాజిగిరి, జల్పల్లి, మీర్పేట, పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట్, జగిత్యాల, సూర్యాపేట, సిద్దిపేట, మిర్యాలగూడ, కొత్తగూడెం, పాల్వంచ, నిర్మల్, మంచిర్యాల, తాండూర్, వికారాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్, గద్వాల్, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్, బొల్లారం, అమీన్పూర్, గజ్వేల్, మెదక్లో ఒకటి చొప్పున బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయనున్నారు.
8వ తేదీ నుంచి సెలవులు
ఈనెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రెండో శనివారం కూడా వస్తున్నందున ఈనెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు.