హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్ 1, 2 పరీక్షలకు సిద్ధమయ్యేవారికి సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకొన్నది. క్యాబినెట్ నిర్ణయంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత పారదర్శకంగా జరగనున్నది. గ్రూప్ 1, 2లకు సాధారణంగా తొలుత ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్లో విజయం సాధించి, నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులకు రెండో దశలో భాగంగా మెయిన్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉండేది. రాత పరీక్షల్లో మెరిట్ ఆధారంగా 1ః2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపికచేసేవారు. ప్రస్తుతం ఇంటర్వ్యూలు రద్దు చేయడంతో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో మార్కుల ఆధారంగానే ఉద్యోగ ఎంపిక ఉంటుంది. క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం జీవో -47 జారీచేశారు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పారదర్శకత, అభ్యర్థుల్లో నమ్మకం పెంచడంతోపాటు పక్షపాత రహితంగా నియామకాలు జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ జీవో వెలువడ్డ తర్వాత జారీ అయ్యే నోటిఫికేషన్లకు ఇంటర్వ్యూలు ఉండవని పేర్కొన్నారు. ఇతర నియామకపు సంస్థలు, శాఖాపరమైన ఎంపిక కమిటీల్లోను ఇంటర్వ్యూలు ఉండవని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ అంటేనే విపక్ష, ప్రాంతీయతత్వంలో కూడుకుని ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. 2011 గ్రూప్ -1లో అవకతవకలతో ఏపీపీపీఎస్సీ అపనిందలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా 2007 గ్రూప్ -1లోను ఇదే జరిగింది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ సర్కారు వివక్షకు తావు లేకుండా, పక్షపాతానికి అవకాశం లేకుండా పారదర్శకంగా జరగాలని ఇంటర్వ్యూలను రద్దుచేసింది. అస్తవ్యవస్థమైన విధానం తెలంగాణలో ఉండరాదన్న సదుద్దేశంతోనే ఇంటర్వ్యూలను రద్దు చేసింది.
తగ్గనున్న మార్కులు
ఇంటర్వ్యూల ఎత్తివేతతో గ్రూప్ -1, 2లో మొత్తం మార్కులు తగ్గే అవకాశముంది. ప్రస్తుతం గ్రూప్ -1 మెయిన్స్లో 900 మార్కులు, ఇంటర్వ్యూలకు 100 మార్కులు మొత్తంగా వెయ్యి మార్కులను అమలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో గ్రూప్ -1లో వంద మార్కులు తగ్గి 900 మార్కులకే పరిమితంకానుంది.
గ్రూప్ -2లో రాత పరీక్షను 600 మార్కులకు నిర్వహిస్తుండగా, ఇంటర్వ్యూకు 75 మార్కులు మొత్తంగా 675 మార్కులకు నిర్వహిస్తుండగా, తాజా నిర్ణయంతో 75 మార్కులు తగ్గి, 600 మార్కులకే పరీక్షా విధానం ఉండనున్నది.
పోలీస్ నియామకాల్లో వయోపరిమితి పెంపు
రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగబోతున్న పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో 3 సంవత్సరాలు సడలించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఉద్యోగార్థుల నుండి వచ్చిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నది.