Uttam Kumar Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల అప్పగింతపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఒకే విషయాన్ని పదేపదే చెప్తున్నారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం సీఎం చెప్పిన విషయాన్నే మళ్లీ చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులు అప్పగించాలన్న నిర్ణయం తమది కాదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. అంతలోనే మళ్లీ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదని తేల్చి చెప్పారు.
2015 నుంచి కేఆర్ఎంబీ సమావేశాల్ల్లో ఏమేం జరిగిందో వివరించారు తప్పితే 2014కు ముందు కేంద్రంలోని యూపీఏ, రాష్ట్రంలోని కాంగ్రెస్ హయాంలో జరిగిన ఒప్పందాల గురించి కానీ, విభజన చట్టంలో చేర్చిన అంశాల గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. కేసీఆర్, జగన్ పదేపదే చర్చలు జరుపుతూ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. గత బడ్జెట్లో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి మూడు ప్రాజెక్టులు అప్పగించేందుకు రూ. 200 కోట్లు కేటాయించారని తెలిపారు. మరి ఈ నిధులను గత ప్రభుత్వం వినియోగించిందా? లేదా? అన్న ప్రశ్నకు మాత్రం మంత్రి సమాధానం దాటవేశారు.