హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు, వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే సంవత్సరానికి చార్జీల భారం మోపమని, పాత చార్జీలనే కొనసాగిస్తామని ప్రకటించాయి. ఈ మేరకు 2023-24 సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్)ను బుధవారం తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏఆర్సీ)కి సమర్పించాయి. 2022-23 సంవత్సరంలో కొనసాగుతున్న ప్రస్తుత టారిఫ్ను యాథావిధిగా కొనసాగించాలని కోరుతూ ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుకు ఏఆర్ఆర్ ప్రతిపాదనలను సమర్పించాయి. దీంతో వచ్చే ఏడాది చార్జీలు పెంచకుండా, ప్రస్తుత టారిఫ్నే కొనసాగించే అవకాశమున్నది.
ప్రజాభిప్రాయసేకరణ జరుపుతాం
పాత టారిఫ్నే కొనసాగించాలని డిస్కంలు ప్రతిపాదించాయని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు చెప్పారు. రాష్ట్రంలోని రెండు డిస్కంలు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏఆర్ఆర్ ప్రతిపాదనలు సమర్పించిన సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం వెల్లడించిన నిబంధనల ప్రకారం డిస్కంలు యూనిట్కు 30 పైసలు పెంచుకొనే అవకాశమున్నదని, యూనిట్కు 50 పైసలకు పెంచాలంటే ఈఆర్సీ అనుమతి అవసరమవుతుందని పేర్కొన్నారు. డిస్కంల ప్రతిపాదనలు చార్జీల పెంపు, తగ్గింపు అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని చెప్పారు. వ్యవసాయానికి విద్యుత్తు అందించే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు పెట్టాలని, 500 యూనిట్ల వినియోగదారులు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టుకోవాలని డిస్కంలకు సూచించామని చెప్పారు.