హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలో వచ్చి నెలన్నర గడుస్తున్నది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్యారంటీల అమలును గాలికొదిలేసింది. గృహజ్యోతి, పింఛన్ల పెంపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాల ఊసే ఎత్తడంలేదు. గ్యారంటీలను అమలుచేయడానికి దరఖాస్తులు తీసుకున్నప్పటికీ.. విధివిధానాలను ఇంకా ఖరారుచేయలేదు. అసలు ఆ పథకాలను ఎప్పుడు అమలుచేస్తారా అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఆసరా పింఛన్ల (Aasara Pensions) పెంపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పాత పద్ధతిలోనే విడుదల చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్నారు. ప్రస్తుతం సాధారణ పెన్షన్ రూ.2,016, దివ్యాంగ పింఛను రూ.3,016 వస్తున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సాధారణ పింఛనును రూ.4 వేలు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ను రూ.6 వేలు చేస్తామని ప్రకటించారు. ఆ హామీ ఎప్పటి నుంచి నెరవేరుతుందనే స్పష్టత లేకపోవడంతో పాత తరహాలోనే పింఛన్లను విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 15,98,729 మంది వృద్ధులు, 15,60,707 మంది వితంతువులు, 5,03,613 మంది దివ్యాంగులు, బీడీ కార్మికులు 4,24,585 మంది, ఒంటరి మహిళలు 1,42,394, గీత కార్మికులు 65,307, చేనేత కార్మికులు 37,145, హెచ్ఐవీ బాధితులు 35,998.. ఇలా వివిధ వర్గాలవారు మొత్తం 43,96,667 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరికోసం ప్రతినెలా రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతోంది. ఇక, రైతుబంధు విషయంలో కూడా ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికల నాటికే పంటసాయం పెట్టుబడి డబ్బు సమకూరినప్పటికీ.. ఇప్పటివరకు రైతులకు ఆ మెత్తాన్ని అందిచంలేదు.