తెలంగాణకు నయాపైసా ఇవ్వని కేంద్రం
ఇటీవలే 15 రాష్ట్రాలకు 7,293.78 కోట్లు
ఎన్నిసార్లు విన్నవించినా బుట్టదాఖలు
కేంద్రం వైఖరిపై ఎమ్మెల్సీ కవిత మండిపాటు
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో తెలంగాణ పట్ల కేంద్రం అంతులేని వివక్ష చూపుతున్నదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. హైదరాబాద్ వరద బాధితులకు సాయం అందించడంలో బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గురువారం ఆమె ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. 2021-22లో వివిధ రాష్ట్రాలకు అందించిన జాతీయ విపత్తుల ఉపశమన నిధుల (ఎన్డీఆర్ఎఫ్) వివరాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఇటీవల 15 రాష్ట్రాలకు వరద సాయం కింద రూ.7,293.78 కోట్లు విడుదల చేసిన కేంద్రం, తెలంగాణను కనీసం పట్టించుకోలేదు. ఆ నివేదికను ట్విట్టర్లో కవిత పోస్ట్ చేశారు. వరదల సమయంలో సీఎం కేసీఆర్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారని, కేంద్రం మాత్రం ఇప్పటికీ పైసా ఇవ్వలేదని విమర్శించారు. 2020 అక్టోబర్లో వచ్చిన భారీ వర్షాలతో హైదరాబాద్ను వరదలు ముంచెత్తాయి. ఒకే రోజు 32 సెంటీమీటర్ల వర్షం కురువటంతో అనేక కాలనీలు నీట మునిగాయి. దాదాపు రూ.5-6 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే.
కేంద్రం దిగిరాకుంటే ఢిల్లీ వీధుల్లో ఉద్యమం
రాష్ట్రంలో పండించే ప్రతి గింజనూ కేంద్రమే కొనాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ విషయంలో అన్ని రాష్ర్టాలకు ఒకే విధానం ఉండాలని అన్నారు. కేంద్రం తెలంగాణ ధాన్యం తీసుకోకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉవ్వెత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. గురువారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలోని 130 కోట్ల జనాభాకు ఆహార భద్రత ముఖ్యమని, భవిష్యత్తులో ఏదైనా సంక్షోభం తలెత్తితే ఏ దేశమూ మనకు సహాయం చేయలేదని తెలిపారు. ఆహార భద్రత కోసమే ఏర్పడిన ఎఫ్సీఐకి ఇప్పటికీ ఎలాంటి వార్షిక క్యాలెండర్ లేదని, ధాన్యం సేకరణకు సరైన విధానం కూడా లేదని ధ్వజమెత్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నదని ఆరోపించారు. ఆధార పంటల కొనుగోలుపై వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడకముందు నీటి కొరతతో అల్లాడిన తెలంగాణ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేండ్లలోనే దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని తెలిపారు. అద్భుతమైన సాగు విధానాలు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతులపై నీటి పన్ను రద్దు, రైతుబంధు తదితర పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. ధాన్యం సేకరణపై కేంద్ర మొండి వైఖరితో రాష్ట్రంలోని 61 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పంజాబ్లో కొనుగోలు చేసినట్టే తెలంగాణ ధాన్యాన్ని కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు.