గజ్వేల్, మార్చి 9: వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని 33/11 విద్యుత్తు సబ్స్టేషన్ను బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ముట్టడించారు. అనంతరం లాగ్బుక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ భానుప్రసాద్, ఏడీఈ జగదీశ్, ఏఈ మారుతికి విద్యుత్తు సమస్యపై వినతిపత్రాలు అందజేశారు. ఆ తరువాత గజ్వేల్ మండలం అక్కారం పంప్హౌస్ వద్ద కొండపోచమ్మ కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ విద్యుత్తు సరఫరా విషయంలో ప్రభుత్వం చెప్తున్న మాటలకు కరెంట్ ఇస్తున్న విధానానికి పొంతన లేదని దుయ్యబట్టారు. వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరని తెలిపారు. రాబోయే పది రోజుల్లో కరెంట్ అందకపోతే సాగుచేసిన వరి పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
11 గంటలకు మించి కరెంట్ను రైతాంగానికి సరఫరా చేయడం లేదని, అందులో ఎల్సీ, ఇతర పనుల కోసం కరెంట్ మరో రెండు గంటలు అంతరాయం కలుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని 64 సబ్స్టేషన్ల పరిధిలో ఇదే పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతాంగాన్ని గాలిలో వదిలేసిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తప్పకుండా తగులుతుందని చెప్పారు. రెండున్నరేండ్ల కాలంలో ఐదు విడతలుగా ఇవ్వాల్సిన రైతుబంధు డబ్బులను కేవలం మూడు విడతలుగా ఇచ్చి రెండు విడతలు ఎగ్గొట్టిందని విమర్శించారు. రాబోయే పది రోజుల్లో రైతుభరోసా ఇవ్వకపోతే ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన, రైతుబంధు సమితి రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ దేవి రవీందర్, నాయకులు చంద్రమోహన్రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.