హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకలు… డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్లో శనివారం పండుగ వాతావరణంలో మొదలైంది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు చెందిన 11,700 మంది లబ్ధిదారులకు తొమ్మిది ప్రాంతాల్లో మంత్రులు, మేయర్, డిప్యూటీ స్పీకర్ భారీ ఏర్పాట్లు చేసి.. పత్రాలను అందజేశారు.
దశలవారీగా మిగిలిన ఇండ్లను అర్హులందరికీ పంపిణీ చేస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఇటీవల 68,632 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా… మిగిలిన వాటి పనులు చివరి దశలో ఉన్నా యి. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డ్రా నిర్వహించారు. తొలి విడతలో భాగంగా 11,700 మంది లబ్ధిదారులను ఎంపికచేశారు. ఈ మేరకు శనివారం గ్రేటర్ పరిధిలో తొమ్మిది చోట్ల వేదికలను ఏర్పాటు చేశారు. మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, మహేందర్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్అలీ, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సనత్నగర్, కూకట్పల్లి, గోషామహల్, నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, అంబర్పేట, మలక్పేట, యాఖత్పుర, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర నియోజకవర్గాలకు చెందిన 500 మంది చొప్పున లబ్ధిదారులతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 200 మంది లబ్ధిదారులకు వీటిని కేటాయించారు.
ప్రభుత్వ పక్కా ఇల్లు పొందడం అంటేనే పైరవీల రాజ్యం అనేది గత అనుభవాలసారం. లబ్ధిదారుడు జేబు నుంచి వేల రూపాయలు చెల్లించడంతోపాటు ఎప్పుడూ రుణం పేరిట కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఆ చరిత్రకు భిన్నంగా గ్రేటర్లో శనివారం జరిగిన డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ పండుగ నిరుపేదల మోములో నిజమైన ఆనందాన్ని నింపింది. పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. లబ్ధిదారులను అధికారులు గౌరవంగా బస్సుల్లో తరలించి, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కేటాయింపు పత్రాలను ఇప్పించారు. వారికి భోజనం పెట్టి, అంతే గౌరవంగా బస్సుల్లో వారిని గమ్యస్థానాలకు చేర్చారు.
విస్తీర్ణం: 560 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా
ప్రభుత్వపరంగా ఒక్కో గృహ నిర్మాణానికి వెచ్చించిన వ్యయం: రూ.7.90 లక్షలు
మౌలిక వసతుల కల్పనకు వెచ్చించిన వ్యయం: రూ.75 వేలు
ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటిపై ప్రభుత్వం వెచ్చించిన వ్యయం: రూ.8.65 లక్షలు
లబ్ధిదారుడి వాటా : సున్నా. ఇంటిపై రుణం: సున్నా
విస్తీర్ణం :300 చదరపు అడుగులు
ఒక్కో యూనిట్ (గృహం) విలువ: రూ.2 లక్షలు
లబ్ధిదారుడి వాటా: రూ.36 వేలు
రాష్ట్ర ప్రభుత్వ వాటా: రూ.36 వేలు
కేంద్ర ప్రభుత్వ వాటా : రూ.1.28 లక్షలు
విస్తీర్ణం: 218.82 చదరపు అడుగులు
ఒక్కో యూనిట్ (గృహం) విలువ: రూ.లక్ష
బ్యాంకు రుణం: రూ.72,250
లబ్ధిదారుడి తొలి వాటా: రూ.వెయ్యి రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.9,800 బ్యాంకు డిపాజిట్
లబ్ధిదారుడి మలి వాటా : రూ.20,613
కేసీఆర్ మాట అంటే మాకు ఎంతో గురి.. పింఛన్ పెంచుతా అన్నడు.. పెంచి చూపించారు.. ఆడపిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి ఇస్తా అన్నడు ఇస్తున్నరు.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్నడు.. ఈ రోజు ఒక్క పైసా తీసుకోకుండా నాకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారు. ఇన్నేండ్లు కిరాయి ఇంట్లో ఉన్న నాకు ఇక్కడి ఇండ్లు చూస్తే నోట మాట వస్తలేదు.
– పార్వతమ్మ. కార్మికనగర్, రహ్మత్నగర్ డివిజన్, హైదరాబాద్
కర్ధనూరులో నాకు డబుల్ బెడ్రూం ఇల్లు అందజేసిన సీఎం కేసీఆర్ సారు సల్లగ ఉండాలి. 20 ఏండ్ల నుంచి కిరాయి ఇంట్ల ఉంటున్నం. నా భర్త కూలీ. ఇద్దరు పిల్లలు బడికి పోతున్నరు. అధికారులు ఫోన్ చేసినప్పుడు నేను నమ్మలేదు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తున్నమని చెప్పంగనే చాలా సంతోషం అనిపించింది. సీఎం కేసీఆర్ మా దేవుడు.
– మాధవి, మైలార్దేవర్పల్లి, రాజేంద్రనగర్
నాలుగేండ్ల క్రితం డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నం. పదేండ్ల నుంచి కేసీఆర్కే ఓటు వేస్తున్నం. తప్పకుండా ఇల్లు వస్తుందని నమ్మకం ఉండేది. డబుల్ బెడ్రూం ఇండ్లకు డబ్బులు ఇవ్వాలని కొంతమంది మాట్లాడుకునే వాళ్లు. ఎవరికీ పైసా ఇవ్వవద్దని మా ఎమ్మెల్యే మాగంటి సార్ మీటింగ్స్లో చెప్పేవారు. అందుకే ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. పైసా ఖర్చులేకుండా 50 లక్షల విలువైన ఇంటిని కేసీఆర్ మాకు ఇచ్చాడంటే నమ్మలేకుండా ఉన్నం. నాతోపాటు మా బంధువులందరూ ఫోన్లు చేస్తూ కంగ్రాట్స్ అంటుంటే ఎంతో సంతోషంగా ఉన్నది. ఇరుకైన కిరాయి ఇంట్లో ఉంటున్న మాకు సొంతిల్లు రావడం కలలాగానే అనిపిస్తున్నది.
– సల్మాబేగం, బోరబండ, హైదరాబాద్
పాతబస్తీల 30 ఏండ్లుగా కిరాయికి ఉంటున్నం. నాకు ఏడుగురు పిల్లలు. పిల్లల పెండ్లిలు మొత్తం కిరాయి ఇంట్లోనే చేసిన. బట్టలు కుట్టి ప్రతి నెలా కిరాయి కడుతున్న. ఎన్నో ఏండ్లుగా సొంత ఇల్లు ఉండాలని ఆ అల్లాను కోరుకున్నం. అర్జీ పెట్టుకున్నా ఏనాడు మాకు ఇల్లు రాలేదు. ఏ పార్టీ అయినా ఓట్లు వేయించుకున్నాయి. కానీ మా బతుకులను పట్టించుకోలేదు. ఇన్నాళ్లుకు సీఎం కేసీఆర్ మాకు సొంత ఇల్లు ఇచ్చి పుణ్యం కట్టుకున్నడు. సొంతిటి కల నేరవేరింది. చాలా సంతోషంగా ఉన్నం.
– ఫాతిమా బేగం (పూల్బాగ్)
మా అమ్మపేరిట డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు కావడం సంతోషంగా ఉన్నది. ఈ అనందాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్న. సొంతిల్లు అనేది మా తల్లిదండ్రుల కల. అది ఇప్పుడు నెరవేరడం చెప్పలేని ఆనందాన్ని ఇస్తున్నది. సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
-కల్యాణి, లబ్ధిదారు, కూతురు
డబుల్ బెడ్రూం రావడం కలలో కూడా ఊహించని బహుమతి. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం గడుపుతున్న మాకు సీఎం కేసీఆర్ సార్ ఆ బాధను తప్పించారు. డబుల్ బెడ్రూంకు దరఖాస్తు చేసుకునేటప్పుడు వస్తదో, రాదో అనుకున్నం. కానీ ఇంటి సర్టిఫికెట్ను అందుకోవడం జీవితంలో మరువలేని అనుభూతిని పొందుతున్నం.
– మల్తుంకార్ దీపిక
నేను కొన్నేండ్లుగా కిరాయికి ఉంటున్నా. నాకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అన్ని సౌకర్యాలతో కట్టించి ఇవ్వడం సంతోషంగా ఉన్నది. ఏండ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరింది. ఈ ప్రభుత్వం హయాంలో సంతోషంగా ఉన్నాం. మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మరోమారు సీఎం కేసీఆర్ను గెలిపించుకుందాం. మన అందరి భవిష్యత్తు కేసీఆర్ చేతిలో పెడితే బంగారు భవిష్యత్తు ఉంటుంది. దానం నాగేందర్ అన్న మా కుటుంబ సభ్యుని లాంటి వారు. మా సమస్యలన్నీ తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తారు. మంత్రి హరీశ్రావు, తలసాని శ్రీనివాస్, దానం నాగేందర్కు ధన్యవాదాలు.
-నిఖిత, ఖైరతాబాద్