హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కృష్ణానదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీలేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. నదీజలాల్లో రాష్ట్ర వాటాను హక్కుగా పొందటానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు దిశగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మంగళవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఆరు గంటలకు పైగా జరిగిన ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న సాగునీటి వివక్ష గురించి సమావేశం లోతుగా చర్చించారు. స్వయంపాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదని సమావేశం తీర్మానించింది. రాష్ట్రం తరపున ఎటువంటి వ్యూహాన్ని, ఎత్తుగడలను అనుసరించాలనే విషయాలకు సంబంధించి సమావేశంలో సీఎం కేసీఆర్ అధికారులకు మార్గనిర్దేశంచేశారు. నదీజలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటివాటాను రాబట్టుకోవటం సహా, తెలంగాణ లిఫ్ట్లను నడిపించేందుకు జల విద్యుదుత్పత్తిని కొనసాగించాలని రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రాన్ని ఒత్తిడిచేస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్, కేఆర్ఎంబీ, న్యాయస్థానాలు తదితర వేదికలు సహా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని నిర్ణయించింది. ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ వాదనను వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు దక్కాల్సిన నీటివాటాను నిర్ధారించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రాన్ని ఒత్తిడిచేస్తూ వస్తున్నది. ఈ సమావేశంలో మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ సోమేశ్కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఈఎన్సీ మురళీధర్రావు, సీఎంవోఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, అడ్వకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.