హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగా ణ): తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో రూ.573.13 కోట్లతో చేపట్టే జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పా రు. ఇందులో హైదరాబాద్-భూపాలపట్నం సెక్షన్లో 163వ జాతీయ రహదారి విస్తరణ, నాగర్కర్నూల్ జిల్లాలో కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, ఎన్హెచ్-167కేలో 2/4 లేన్ల అభివృద్ధి పనులు ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
హైదరాబాద్ భూపాలపట్నం సెక్షన్లో రూ.136.22 కోట్ల వ్యయంతో ములుగు జిల్లా పరిధిలో ప్రస్తుతమున్న రెండు లేన్ల రోడ్డు విస్తరణ, ఫుట్పాత్ల నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. లక్నవరం లేక్, బొగత వాటర్ఫాల్స్ వంటి ప్రముఖ పర్యాటక స్థలాలు ఉన్న ఈ రోడ్డు విస్తరణవల్ల తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయన్నారు. రూ.436.92 కోట్ల వ్యయంతో నాగర్కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ వద్ద కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి అప్రోచ్లు సహా ఎన్హెచ్-167కే 2/4 లేన్ల జాతీయ రహదారి అభివృద్ధి, పునరావాసం పనులను కూడా ఆమోదించినట్టు గడ్కరీ తెలిపారు. పనులను ఈపీసీ పద్ధతిలో చేపట్టనున్నామని, ఈ రహదారి అభివృద్ధితో హైదరాబాద్/కల్వకుర్తి నుంచి తిరుపతి, నంద్యాల/చెన్నయ్ మార్గంలో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణదూరం తగ్గుతుందని అన్నారు. ప్రస్తుతం ఎన్హెచ్-44మార్గంలో వెళ్తున్న వాహనాలు ఈ రహదారి అభివృద్ధి పూర్తయ్యాక ఎన్హెచ్-167కే పై వెళ్తాయన్నారు.కొల్లాపూర్ వద్ద మంజూరైన ఐకానిక్ బ్రిడ్జి తెలంగాణ, ఏపీలకు గేట్వేగా మారి పర్యాటకాన్ని పెంపొందించేందుకు దోహదపడగలదని ఆశాభావం వ్యక్తంచేశారు.