Temperature | హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ‘రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి’ అని చెప్తుంటారు. అంటే.. మే చివరివారంలో లేదా జూన్ మొదటివారంలో ఇలా జరుగుతుంటుంది. కానీ, ఈ సారి ఏప్రిల్లో తొలినాళ్లలోనే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్లో అత్యధికంగా 43.5 డిగ్రీ సెంటీగ్రేడ్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అతి తక్కువగా వరంగల్ జిల్లాలో 40.6 డిగ్రీలుగా నమోదైంది. ఈ లెక్కన అన్ని జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జోన్లో ఉన్నాయి. వాస్తవానికి గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలోని 10 జిల్లాల్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈసారి మాత్రం అన్ని జిల్లాలు భానుడి ప్రతాపంతో భగ్గుమంటున్నాయి.
నిర్మల్ జిల్లాలో నిరుడు ఏప్రిల్ 2న అత్యధికంగా 41.6 డిగ్రీలు నమోదైతే.. ఈసారి ఏకంగా 2 డిగ్రీలు పెరిగింది. జగిత్యాల జిల్లాలో 3.5 డిగ్రీలు అధికంగా నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్లోనూ అత్యధికంగా కుత్బుల్లాపూర్లో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.
గతేడాది ఇదే సమయానికి గ్రేటర్లో అత్యధిక ఉష్ణోగ్రత 38.3 డిగ్రీలు మాత్రమే. అంటే 3.8 డిగ్రీల వ్యత్యాసం నమోదైంది. మరోవైపు బుధవారం నుంచి రాష్ట్రంలో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదని భారత వాతావరణశాఖ గతంలోనే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్న పిల్లలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లకపోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.