ఖిల్లాఘణపురం, ఏప్రిల్ 16 : కేసీఆర్ సర్కారు హయాంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
ప్రాజెక్టు పనులు తక్షణమే పూర్తిచేసి వచ్చే సీజన్లో సాగునీరందించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను నయవంచన చేస్తూ అధికారం చేపడుతున్నారని ఆరోపించారు. నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలును విస్మరించిన కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా స్పందించడం లేదని విమర్శించారు.