హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఆగ్రహంవ్యక్తంచేశారు. రైతులు పంటలు తగులబెట్టుకుంటుంటే బాధ కలుగుతుందన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కష్టపడి సాగుచేసిన రైతు తన పొలాన్ని తగులబెట్టుకునే దుస్థితి దాపురించిందన్నారు. కాంగ్రెస్ మంత్రులు, నేతలు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రైతుల దగ్గరికి వెళ్లే ధైర్యం కాంగ్రెస్ మంత్రులు, నేతలకు లేదని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదనంగా ఏదో వస్తుందని ఆశపడ్డామని రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. హోల్సేల్గా కాంగ్రెస్ మోసం చేస్తుందనుకోలేదని బాధపడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు వ్యతిరేకంగా మంత్రి తుమ్మల మాట్లాడటం బాధకలిగిందని వెల్లడించారు. ఆత్మవంచన చేసుకొని ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మంత్రిని చూస్తే జాలేస్తున్నదని, ఎవరిని మెప్పించడానికి పాట్లుపడుతున్నారని అడిగారు. ఉద్యమం సమయంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి సీఎంలుగా ఉన్నపుడు వాళ్ల దృష్టిలో పడటానికి కేసీఆర్ను ఇంతకంటే ఎక్కువగా తిట్టారని విమర్శించారు. తర్వాత కేసీఆర్ దగ్గరికి వచ్చి మంత్రివర్గంలో పనిచేసి ఇప్పుడు మళ్లీ పక్క పార్టీలోకి పోయి తిడుతున్నారని చెప్పారు. ఇలాంటివి ఎన్నో చూశాం, ఎంతో మందిని చూశాం.. అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుంది. అన్ని అమావాస్యలు మావి కావు, అన్ని పౌర్ణమిలు మీవి కావన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులకు చేసినవన్నీ తుమ్మలకు తెలుసన్నారు. చేతనైతే రైతు భరోసా రూ.15 వేలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. తాము చేసినదానికంటే రైతులకు ఎక్కువ మేలు చేయాలని సూచించారు. కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద చల్లే దుర్భుద్దే కనిపించిందని విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వాలన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు.
ఉత్తర తెలంగాణలో సగటుకంటే ఎక్కువ వర్షపాతం నమోదయిందని, దక్షిణ తెలంగాణలో వర్షపాతం కొంచెం తక్కువ ఉందని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనంత వదరగ గోదావరిలో గత వర్షాకాలంలో వచ్చిందన్నారు. అత్యధిక వరద వల్లనే మేడిగడ్డ బరాజ్లో రెండుమూడు పిల్లర్లకు నష్టం కలిగిందని చెప్పారు. ఇప్పుడు ఎత్తిపోస్తున్న నీళ్లే రెండు నెలల కింద ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆరోపించారు. కాంగ్రెస్కు పాలన చేతగాక మందిమీద నిందలు వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలో ఉన్నవాళ్లు మాటలతో ఎక్కువ రోజులు దృష్టి మరల్చలేరన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువుకు కేరాఫ్గా కాంగ్రెస్ పాలన ఉండేదని, నిబద్ధత ఉంటే రైతు దశ మార్చవచ్చని కేసీఆర్ నిరూపించారని తెలిపారు. వ్యవసాయం చేయొచ్చని రైతులకు కేసీఆర్ భరోసా కల్పించారని చెప్పారు.