హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన (PMKSY) ప్రాతిపదికగా ప్రభుత్వం రుణమాఫీ అమలు నిర్ణయంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఫైర్ అయ్యారు. రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ ఆంక్షలు గర్హనీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం మూడు విడుతల్లో ఇచ్చేది రూ.6 వేలు మాత్రమేనన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మందికిపైగా రైతులు ఉండగా, కేంద్రం గరిష్టంగా 36.1 లక్షల మంది రైతులకే అమలు చేసిందని వెల్లడించారు.
కేసీఆర్ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చామని చెప్పారు. ఇందులో భాగంగా 11 విడుతల్లో రైతుల ఖాతాల్లో రూ.72,910 కోట్లు జమచేశామని తెలిపారు. యాసంగిలో ఎకరాకు రూ.5 వేలు అరకొరగా ఇచ్చి కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకున్నదని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని తెలిపారు. సాగునీళ్లు, కరెంటు, పంటల కొనుగోళ్లలో రైతాంగాన్ని ఇబ్బందిపెడుతున్నారని ఆరోపించారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.