హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులపై వార్తలు కవరేజీ చేసినందుకు గాను తెలంగాణకు చెందిన ఏడుగురు జర్నలిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈ తాఖీదులు పంపింది. గత సెప్టెంబరులో ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలను ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా తీగలకుంటపల్లిలో నిర్వహించారు.
ఆ తర్వాత హిడ్మా ఎన్కౌంటర్, ఆ తదనంతర పరిణామాలపై వరుసగా కథనాలు రాసిన, తమ చానళ్ల ద్వారా ఇంటర్వ్యూలు చేసిన జర్నలిస్టులను విచారించేందుకు ఎన్ఐఏ సిద్ధపడింది. ఒక్క రాంచంద్రారెడ్డి కేసులోనే దాదాపు 405 మందికి నోటీసులు ఇచ్చిన ఎన్ఐఏ.. ఆ జాబితాలో జర్నలిస్టులను చేర్చడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఎన్ఐఏ నుంచి నోటీసులు అందుకున్న వారిలో మన తొలివెలుగు రఘు, శ్రీశైలం, పాషా, అనిల్, దిశ సతీశ్, బిగ్ టీవీ పవన్, మైక్ టీవీ భార్గవ్ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. వీరంతా ఈనెల 22 నుంచి వరుసగా ఎన్ఐఏ విచారణ ఎదుర్కోనున్నట్టు తెలిసింది. మావోయిస్టులపై వార్తలు రాసిన వారిని, లొంగిపోయిన మావోయిస్టులను ఇంటర్వ్యూలు చేసిన వారికి ఈ నోటీసులు ఇవ్వడం దారుణమని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టిసారించాలని, జర్నలిస్టులను వేధించే చర్యలు ఆపించాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.