ములుగు: ములుగు (Mulugu) జిల్లాలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వర్షాలకు రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. గోవిందరావుపేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163 జాతీయ రహదారిపై (NH 163) నుంచి వరద ప్రవహిస్తుండటంతో గండి పడి రోడ్డు కోతకుగురైంది. దీంతో తాడ్వాయి, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పస్రాలో పలు ఇండ్లలోకి నీరు చేరింది. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే పస్రాలోని అభ్యుదయ కాలనీ దగ్గర రహదారి కోతకు గురైంది. దయ్యాల వాగు సమీపంలోని ఎస్సీ కాలనీలో వర్షం నీరు వచ్చి చేరుతున్నది. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇండ్లు నీటమునిగాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటితో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ నీటిలో కొట్టుకుపోయింది. దీంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతితో కేబుల్ వైర్ తెగిపోవడంతో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గోవిందరావు పేట మండలంలో లక్నవరం జలాశయం మత్తడిపోస్తున్నది. మరిపెడ, చిన్నగూడూరు మండలాల్లో ఆకేరువాగు పొంగి పొర్లుతున్నది. దీంతో పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఇక భారీ వర్షాలతో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను అధికారుల ఖాళీ చేయిస్తున్నారు. వరంగల్ (Warangal) జిల్లా కాశిబుగ్గలో పలు కాలనీలు నీటమునిగాయి. భారీ వర్షాలకు బొంది వాగు పొంగిపొర్లుతున్నది. భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్పస్వామి ఆలయంలోకి వరద పోటెత్తింది. హనుమకొండ-వరంగల్ రహదారి బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తున్నది. కొత్తవాడ, ఆటోనగర్ పరిసరాలు నీటమునిగాయి. భారీ వర్షానికి కరీమాబాద్ తూర్పుకోటలో ఓ ఇళ్లు కూలిపోయింది.
వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. పంతిని వద్ద ఊరచెరువు ఉప్పొంగడంతో నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నది. మైలారం వద్ద భారీ చెట్టు కూలిపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తొర్రూరు వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖమ్మం (Khammam) వెళ్తున్న రెండు లారీలు నీటిలో చిక్కుకుపోయాయి. కట్య్రాల, ఇల్లందు, పంతిని వద్ద జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలకూలాయి. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వద్ద చెరువు మత్తడి పోస్తున్నది. హనుమకొండ (Hanamakonda) నుంచి ములుగు, మేడారం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కమలాపూర్ పోలీస్ స్టేషన్లోకి వరదనీరు చేరింది.